Whats App Hacking : ఈరోజుల్లో ఎవరు ఎటువంటివారో ఎవరికీ అర్ధం కావటంలేదు… పెద్దవాళ్లైనా చిన్న పిల్లలైనా…ఎవరితోనైనా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. టెక్నాలజీ పెరిగిపోయాక మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. 21 ఏళ్ల యువతి తన తల్లి ప్రియుడ్నే బ్లాక్ మెయిల్ చేసి హడలెత్తించింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.
మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఒక మహిళ ధనికుడైన వ్యాపార వేత్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ క్రమంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఒకనొక సమయంలో ఆ మహిళ కుమార్తె (21) తన తల్లి వాట్సప్ ను హ్యాక్ చేసింది.
అందులో తన తల్లి ప్రియుడితో కలిసి సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు, చాటింగ్ చూసింది. వాటిని తన తల్లికి తెలియకుండా తన వాట్సప్ లో సేవ్ చేసుకుంది. అనంతరం తన స్నేహితురాలితో కలిసి ఆ వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించింది.
అతనికి ఫోన్ చేసి తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించింది. పరువు పోతుందనే భయంతో ఆ వ్యక్తి మొదట రూ.2.6 లక్షలు ఇచ్చాడు. అంతటితో సంతృప్తి చెందకుండా ఆయువతి ఏకంగా రూ.15 లక్షలు కావాలని డిమాండ్ చేయటం మొదలు పెట్టింది.
దీంతో బాధిత వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ నెంబరు ఆధారంగా యువతిని, ఆమె స్నేహితురాలిని అరెస్ట్ చేసి వారి నుంచి ఫోటోలు వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.