Bank Robbery : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లోని ఫిన్కేర్ బ్యాంక్లో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంక్ మేనేజర్ స్రవంతే అసలు దొంగ అని నిర్ధారణకు వచ్చారు. బ్రాంచ్ మేనేజర్ గా, అప్రైజర్ గా కొనసాగుతున్న స్రవంతి పధకం ప్రకారమే బ్యాంకులో దోపిడీ జరిగినట్లు నాటకం ఆడినట్లు గుర్తించారు.
గిల్టు నగలు తాకట్టుపెట్టి పని చేసే బ్యాంకు నుంచి రుణాలు కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. త్వరలో బ్యాంకు ఉన్నతాధికారులు ఆడిట్ నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తన బండారం బయట పడుతుందని భయం వేసిన స్రవంతి దొంగతనం నాటకానికి తెర తీసింది. చెన్నైకు చెందిన ముగ్గురు యువకులతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని పక్కా ప్లాన్ వేసింది. బ్యాంకు లాకర్ లో 67 ప్యాకెట్లలో ఉన్న దాదాపు రెండు కేజీల బంగారు, 5 లక్షల రూపాయలు నగదును తాను డీల్ కుదుర్చుకున్న యువకులకు స్రవంతి ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది.
ఈ ప్లాన్ లో స్రవంతికి తన స్నేహితుడైన మరో యువకుడు సాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు విచారణలో ఆమె ఒక్కోసారి ఒక్కో సమాధానం చెప్పింది. దీంతో పోలీసులకు మొదటి నుంచి ఆమె పైనే అనుమానం కలిగింది. అసలు నిజాన్ని స్రవంతి నుంచే రాబట్టి సొత్తు రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకే స్రవంతే ఈ ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read : Monkeypox : మంకీపాక్స్ పై అలర్టైన తెలంగాణ-21 రోజులు ఐసోలేషన్
గురువారం రాత్రి గం.10-40 సమయంలో దొంగతనం జరిగింది. చోరీ తర్వాత ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకులో చోరీకి సంబంధించి ముగ్గురిని చెన్నైలో అదుపులోకీ తీసుకున్నారు. వారి వద్ద నుంచి కిలోన్నర బంగారం, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.