Anna Hazare: సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో మద్యం అమ్మకాలకు.. పర్మిట్లు ఇస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మద్యం పాలసీపై మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హజారే గత వారం ప్రకటించారు. అయితే.. మద్యం పాలసీ విధానంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడం..ప్రజాభిప్రాయం అనంతరం ఈ విషయంపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుండడంతో.. ఫిబ్రవరి 14న చేపట్టాల్సిన ఆమరణ నిరాహార దీక్షను విరమించుకుంటున్నట్లు అన్నా హజారే ప్రకటించారు.
Also read: Police System: పోలీసు వ్యవస్థ ఆధునీకరణ కోసం రూ. 26,275 కోట్ల నిధులకు కేంద్రం ఆమోదం
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగాన్ సిద్ధి గ్రామానికి చెందిన అన్నా హజారే.. ఆదివారం “గ్రామ సభ” నిర్వహించి ఈమేరకు గ్రామస్తులతో చర్చించారు. మద్యం పాలసీపై ప్రభుత్వ నిర్ణయం ఇంకా పెండింగ్ లోనే ఉన్నందున తాను నిరాహార దీక్ష చేయడం సబబుకాదని భావించినట్లు అన్నా హజారే వివరించారు. అదే సమయంలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంపై హజారే మండిపడ్డారు. శివాజీ మహారాజ్, తుకారాం మహారాజ్ వంటి మహోన్నత వ్యక్తులు నడయాడిన మహారాష్ట్రలో.. సంప్రదాయాలు మసకబారేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read: Assembly Elections: ఉత్తరప్రదేశ్ రెండో దశ, గోవాలో మొదటి విడత పోలింగ్కి సర్వం సిద్ధం
మద్యం, సారా విధానాలు మహారాష్ట్ర సాంప్రదాయాల్లో లేవని, ఇప్పుడు ప్రభుత్వం తెచ్చే విధానంతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగి సాంప్రదాయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మద్యం దుఖాణాలు, బార్లు, బెల్టు షాపులు సరిపోవన్నట్టు సూపర్ మార్కెట్లో మద్యం అమ్మకాలు దేనికని ప్రశ్నించిన అన్నాహజారే.. ప్రభుత్వం దగ్గరుండి ప్రజలను మద్యానికి బానిసలను చేయాలనీ చూస్తోందని విమర్శించారు.
Also read: IPL Auction: చిన్న ప్లేయర్లపై అన్ని కోట్లు కుమ్మరించాల్సిన అవసరం లేదు: గవాస్కర్