Pakistan
ICC World Cup : వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గర పడుతోంది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్లకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ (Pakistan )మ్యాచ్ కూడా ఇదే వేదికగా జరగనుంది. అయితే.. బాబర్ ఆజామ్ నేతృత్వంలోని పాక్ జట్టు వన్డే ప్రపంచకప్లో పాల్గొనేది లేనిది ఇంకా వెల్లడించలేదు.
పాకిస్తాన్ ప్రపంచకప్లో ఆడేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ పాకిస్తాన్ గనుక ప్రపంచకప్ ఆడకుంటే పరిస్థితి ఏంటి..? 9 దేశాలతోనే మ్యాచులను నిర్వహిస్తారా..? రీ షెడ్యూల్ చేస్తారా..? లేదంటే పాకిస్తాన్ స్థానంలో మరో జట్టుకు అవకాశం కల్పిస్తారా..? అన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఒకవేళ పాక్ ఆడకుంటే ఆ జట్టు స్థానంలో మరో జట్టుకు అవకాశం కల్పిస్తారు.
అయితే.. ఏ జట్టుకు అవకాశం దక్కనుందనే దానికి ఐసీసీ సమాధానం ఇచ్చింది. ప్రపంచ కప్ క్వాలిఫయర్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. జింబాబ్వే వేదికగా జరిగిన క్వాలిఫయర్ టోర్నీ ద్వారా శ్రీలంక(Sri Lanka), నెదర్లాండ్స్(Netherlands) జట్లు ప్రపంచకప్కు అర్హత సాధించాయి. సూపర్ సిక్స్ పాయింట్ల పట్టిక ప్రకారం మూడో స్థానంలో స్కాట్లాండ్ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ప్రపంచకప్లో ఆడకుంటే స్కాట్లాండ్ (Scotland)పంట పండినట్లే.
పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ను నిర్వహిస్తే భారత్ పాల్గొనదు అనే విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ చాలా స్పష్టంగా చెప్పింది. దీంతో ఆసియా కప్ను హెబ్రిడ్ మోడ్లో నిర్వహించేందుకు పీసీబీ చేసిన ప్రతిపాదనను భారత్ అంగీకరించింది. హెబ్రిడ్ మోడ్లో భాగంగా పాక్, శ్రీలంకలు ఆసియా కప్కు అతిథ్యం ఇస్తాయి. భారత్ ఆడే అన్ని మ్యాచ్లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి.
ఆసియా కప్ ఆడేందుకు పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో ఇప్పుడు వన్డే ప్రపంచకప్లో ఆడేందుకు పాకిస్తాన్ జట్టును పంపే అవకాశం లేదని పాక్ మంత్రి ఎహ్సాన్ మజారీ అన్నారు. అయితే.. పాకిస్థాన్ పంపాలా వద్దా అన్నదానిపై పాక్ ప్రధాని ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు పైనే పాక్ ప్రపంచకప్లో పాల్గొంటుందా..? లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.
ICC ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్పై గంగూలీ కీలక వ్యాఖ్యలు.. సెమీస్కు చేరే జట్లు అవేనట..