BCCI outrightly rejects five of Gambhir picks as coaching staff members
Gautam Gambhir – BCCI : రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గౌతమ్ గంభీర్ను బీసీసీఐ టీమ్ఇండియా హెడ్ కోచ్గా నియమించింది. త్వరలో జరగనున్న శ్రీలంక పర్యటనతో గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలను చేపట్టనున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. అతడి సహాయక సిబ్బంది ఎంపిక విషయంలోనే పరిస్థితి తారుమారు అవుతోంది. గతంలో హెడ్ కోచ్లుగా పని చేసిన వారు తమకు నచ్చిన సహాయక సిబ్బందిని తెచ్చుకున్నారు. అయితే.. గంభీర్కు మాత్రం బీసీసీఐ అభ్యంతరం చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా.. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మోర్నీ మోర్కెల్ను బౌలింగ్ కోచ్గా తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా బీసీసీఐకి గంభీర్ తెలిపాడు. అయితే.. గంభీర్ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించిందని ది ఎకనామిక్ టైమ్స్ కథనంలో పేర్కొంది. మోర్కెల్తో కలిపి గంభీర్ ఇప్పటి వరకు బౌలింగ్ కోచ్లుగా ముగ్గురి పేర్లు సూచించగా అందరికి బీసీసీఐ నో చెప్పింది. మోర్కల్ కంటే ముందు టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు వినయ్ కుమార్, లక్ష్మీ పతి బాలాజీలను తీసుకోవాలని గంభీర్ భావించాడు.
బౌలింగ్ కోచ్ విషయంలో కాదు ఫీల్డింగ్ కోచ్ విషయంలోనూ గంభీర్ ఎంపికలను బీసీసీఐ కాదంటోంది. ర్యాన్ టెన్ డోస్చాట్, జాంటీ రోడ్స్లలో ఒకరిని ఫీల్డింగ్ కోచ్గా తీసుకోవాలని గంభీర్ అనుకోగా బీసీసీఐ వద్దు అని చెప్పింది. కాగా.. ఇప్పటి వరకు గంభీర్ సహాయక సిబ్బందిలో ఒక్కరికి మాత్రమే బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ అభిషేక్ నాయర్ ను అసిస్టెంట్ కోచ్గా లేదా బ్యాటింగ్ కోచ్గా పని చేసేందుకు ఒకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
నో చెప్పడానికి కారణాలు ఇవేనా..?
గంభీర్ సూచించిన అభ్యర్థుల వ్యక్తిగత సామర్థ్యాలపై ఎవ్వరికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే.. వీరంతా కోల్కతా నైట్రైడర్స్ తరుపున గంభీర్ కెప్టెన్సీలో ఆడిన వారు కావడం గమనార్హం. మోర్కెల్, బాలాజీ, వినయ్కుమార్లు గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ కోసం మూడు సీజన్లు ఆడారు. అభిషేక్ నాయర్ మాత్రమే గంభీర్ నాయకత్వంలో కేకేఆర్కు ఆడలేదు. అయితే.. కేకేఆర్ జట్టుకు ఈ ఏడాది ఐపీఎల్లో నాయర్ అసిస్టెంట్ కోచ్గా ఉండగా గంభీర్ ఆ జట్టుకు మెంటార్గా ఉన్నాడు.
Rishabh Pant : ఢిల్లీ క్యాపిటల్స్కు షాకివ్వనున్న రిషబ్ పంత్..?
మరో 10 రోజుల్లో..
శ్రీలంక పర్యటనకు సమయం దగ్గర పడింది. మరో 10 రోజుల్లో లంకతో టీమ్ఇండియా మ్యాచులు ఆడనుంది. జూలై 27న జరగనున్న మొదటి టీ20 మ్యాచుతో భారత పర్యటన ఆరంభం కానుంది. ఈ లోపు సహాయక సిబ్బంది పై బీసీసీఐ, గంభీర్ ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.