Virat Kohli : ధోని, రోహిత్ శర్మ వచ్చారు సరే.. విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్కు ఎందుకు రాలేదు?
మరో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli)టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు రాకపోవడంపై చర్చ నడుస్తోంది.
Why Virat Kohli Didnt Attend T20 World Cup 2026 Final
- టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్
- ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించిన ధోని, రోహిత్
- గ్రౌండ్లో కనబడని కోహ్లీ
Virat Kohli : టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్ ప్రపంచకప్ను ముద్దాడింది. వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న జట్టుగా, అత్యధిక సార్లు (3) పొట్టి ప్రపంచకప్ను సాధించిన జట్టుగా, తొలి ఆతిథ్య దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలు ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు. మైదానంలోని వీఐపీ బాక్స్ నుంచి వీరిద్దరు మ్యాచ్ను తిలకించారు. వీరిద్దరిని చూసిన భారత అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే.. మరో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ వీరితో పాటు లేకపోవడం చూసి చాలా మంది నిరాశ చెందారు.
ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2020లోనే రిటైర్మెంట్ అయ్యాడు. ఇక రోహిత్, కోహ్లీల విషయానికి వస్తే.. వీరిద్దరు టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికారు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఏది ఏమైనప్పటికి కూడా రోహిత్, ధోనిలు మ్యాచ్కు హాజరుకాగా.. కోహ్లీ రాకపోవడానికి గల కారణం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్కు కోహ్లీ హాజరు కాకపోవడానికి కారణం ఏంటి?
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్కు కోహ్లీ హాజరు కాకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుతోంది. ప్రధానంగా ఓ రెండు కారణాలు మాత్రం బాగా హైలెట్ అవుతున్నాయి.
అధికారిక ఆహ్వానం లేదు..
మాజీ టైటిల్ విజేత కెప్టెన్లుగా ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలు టీ20 ప్రపంచకప్కు అధికారిక హోదాలో హాజరు అయ్యారు. 2007లో ధోని సారథ్యంలో భారత్ తొలిసారి టీ20 ప్రపంచకప్ను గెలుచుకోగా, రోహిత్ సారథ్యంలో 2024 టీ20 ప్రపంచకప్ను భారత్ ముద్దాడింది. కాగా.. కోహ్లీ నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచకప్ను గెలువలేదు. కాబట్టి.. ఈ ఈవెంట్లో కోహ్లీకి అధికారికంగా ఆహ్వానం అందలేదని అంటున్నారు.
కుటుంబ కట్టుబాట్లు..
ప్రస్తుతం కోహ్లీ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. మిగిలిన సమయంలో అతడు కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. తాను రిటైర్ అయిన తరువాత కొంత కాలం తనను చూడలేరని చెప్పాడు.
తన వరకు కుటుంబమే ముఖ్యం అని తెలిపాడు. ప్రస్తుతం ఆటకు పూర్తిగా వీడ్కోలు పలకకపోయినప్పటికి కూడా కోహ్లీ ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మ్యాచ్లను ఇంట్లోనే వీక్షించడానికే మొగ్గు చూపించి ఉండొచ్చునని చెబుతున్నారు.
అయితే.. ఫైనల్ మ్యాచ్కు రాకపోవడానికి అసలు కారణం ఏంటి అనేది కోహ్లీ స్వయంగా చెబితేనే తెలుస్తుంది.
