Revanth Reddy : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ బంగ్లా కార్నర్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు. డోర్నకల్ లో 14 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు కాంగ్రెస్ జెండా ఎగరేసిన చరిత్ర ఈ గడ్డది అన్నారు. తెలంగాణలో పాపాల భైరవుడు కేసీఆర్ ను పాతాళానికి తొక్కేందుకే ఈ యాత్ర అని చెప్పారు. రెడ్యా నాయక్ డోర్నకల్ కు నయా జమిందార్ గా మారారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో రెడ్యా నాయక్ కుటుంబాన్ని ఓడించాలని మా యువకులు ఇక్కడకు వచ్చారని చెప్పారు.
”రాష్ట్రంలో ఐకేపీ సంఘాలకు దిక్కు లేదు. వీఆర్ఏలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు గోస పడుతున్నారు. ఆయన గడీని తొమ్మిది నెలల్లో కట్టుకున్న కేసీఆర్.. నాలుగేళ్లయినా డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేయలేదు. నిన్న మహబూబాబాద్ లో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే, ఎంపీలు మాట్లాడరట. కనుసైగ చేస్తే నన్ను ఏదో చేస్తారట.
కేటీఆర్ కాదు ఏట్లో రావులందరిని తీసుకుని రా. మరిపెడ చౌరస్తాలో నెత్తిమీద కాలు పెట్టి తొక్కుతా. ఇసుక నుంచి గుడుంబా వరకు ఎమ్మెల్యే చేయని దందాలు లేవు. ప్రగతి భవన్ లో ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదు..? ప్రగతి భవన్ గూడుపుటాని ఏంది?.. అందులో వేల కోట్ల కథ ఏందీ? పేదల చెమట వాసనకంటే కాంట్రాక్టర్ల సెంటు వాసన కేసీఆర్ కు ఇంపుగా ఉందా?
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
మళ్లీ చెబుతున్నా.. ఆ ప్రగతి భవన్ గేట్లు బద్దలుకొడతాం. ఎన్ని వందల కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. నువు శాశ్వతం అనుకున్న గడీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. పోలీసులను నమ్ముకుని నేను పాదయాత్ర చేయడం లేదు. మా కాంగ్రెస్ కార్యకర్తలను నమ్ముకుని నేను యాత్ర చేస్తున్నా. రాష్ట్రంలో అన్ని సమస్యలు తీరాలంటే కేసీఆర్ పోవాలి కాంగ్రెస్ రావాలి” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.