NCP vs NCP: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నడుమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుగుబాటుకు పాల్పడ్డమే కాకుండా భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన అజిత్ పవార్ సహా మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు జోరుగా సాగుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారంటే తమవైపే ఉన్నారని ఇరు నేతలు చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో ఇటు శరద్ పవార్, అటు అజిత్ పవార్ బుధవారం బలప్రదర్శనకు దిగారు.
పార్టీకి 54 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ పవార్ నిర్వహించిన బలప్రదర్శనలో 31 మంది ఎమ్మెల్యలు కనిపించగా శరద్ పవార్ నిర్వహించిన బలప్రదర్శనలో కేవలం 13 మంది మాత్రమే కనిపించారు. శరద్ పవార్ నిర్వహించిన ప్రదర్శనలో ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది. అయితే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అజిత్ పవార్ సమావేశాన్ని చట్టవిరుద్ధమని విమర్శించారు. అలాంటి సమావేశాలకు పిలిచే అధికారం పార్టీ అధినేత అయిన తనకు తప్ప మరెవరికీ లేదని అన్నారు. అనంతరమే పవార్, ప్రఫుల్ పటేల్ సహా మరో ఏడుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు.
శరద్ పవార్ తీసుకున్న నిర్ణయం అజిత్ పవార్ వర్గం మీద ఎంత మేరకు పని చేస్తుందనే దానిపై విస్తృత విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అయితే నిజంగానే అజిత్ పవార్ వద్ద 31 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే.. శివసేన విషయంలో జరిగిందే ఇప్పుడు రిపీట్ అవుతుందని అంటున్నారు. అంటే.. ఎమ్మెల్యేల బలం ఎక్కువగా ఉన్న కారణంగా పార్టీ అజిత్ పవార్ వర్గానికే చెందుతుంది. అయితే ముందు నుంచి పవార్ కేవలం అజిత్ సహా మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అజిత్ వద్ద కేవలం 8 మంది ఎమ్మెల్యేలే ఉంటే.. వారిపై అధికారికంగా వేటు వేయడమే కాకుండా తిరుగుబాటును పూర్తిగా అణచివేసే అవకాశం దక్కుతుంది.