Telangana Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మరోసారి కేంద్రం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులపై మండిపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శనివారం ప్రశ్నోత్తరాల సందర్భంగా కార్వాన్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్లో చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోందన్నారు.
శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇలా కంటోన్మెంట్, ఏఎస్ఐ అభివృద్ధికి అడ్డు పడుతోందని చెప్పారు. ఇది మంచి పద్ధతి కాదని, కంటోన్మెంట్ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తామని తెలిపారు.
KTR : కేసీఆర్ను ఒక్కమాట అన్నా ఫిరంగులై గర్జిద్దాం- బీజేపీపై కేటీఆర్ ఫైర్
కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్ చేస్తాం.. నాలాల మీద చెక్ డ్యాంలు కడుతామంటే చూస్తూ ఊరుకోబోమంటూ తేల్చి చెప్పారు. అవసరమైతే కంటోన్మెంట్కు మంచినీళ్లు, కరెంట్ బంద్ చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఒక్క పైసా సాయం చేయలేదని విమర్శించారు. హైదరాబాద్కు వరద సాయం ఇంకా అందలేదని గుర్తు చేశారు. వరదల సమయంలో కేంద్రమంత్రులు వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోయారని విమర్శించారు.
Telangana : బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారు : కేటీఆర్
గుజరాత్లో వరదలు వస్తే మాత్రం ప్రధాని మోదీ స్వయంగా అక్కడికి వెళ్లి రూ.1000 కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో కేంద్రం వాటా శూన్యమని ఎద్దేవా చేశారు. తెలంగాణ వేరే దేశమైనట్లు వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.