Punjab Election Review: దేశంలో గురువారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగింది. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. అయితే పంజాబ్ లో మాత్రం బీజేపీకి తీవ్ర నిరాశ మిగిలింది. ఇక్కడ ఫలితంపై ముందు నుంచి బీజేపీ పెద్దగా అంచనాలు పెట్టుకోకపోవడంతో.. అది పార్టీ వ్యవహారాలపై పెద్దగా ప్రభావం చూపడంలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పంజాబ్ లో అడ్రెస్స్ గల్లంతైంది. మరీ దారుణంగా సీఎం, మాజీ సీఎంలు సైతం ఘోర పరాజయం చవిచూశారు. దేశంలో కాస్తో కూస్తో పట్టున్న పంజాబ్ లోనూ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవడం పార్టీకి అతిపెద్ద దెబ్బ. అయితే ఈ ఓటమిపై విశ్లేషించుకుంటే..పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలే పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొకోవాలి. మాజీ సీఎం అమరీందర్, సీఎం చరణ్జీత్ సింగ్…. కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ.. తమ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ.. ఒకరిని మించి మరొకరు పెత్తనం చెలాయిస్తూ.. కాంగ్రెస్ పార్టీని నిండా ముంచారు. వారు ఓడిపోవడంతో పాటు, పార్టీని సైతం కోలుకోలేని విధంగా దెబ్బతీశారు ఈ ముగ్గురు నేతలు.
Also read:Assembly Election Results 2022 : ఎన్నికల విజయోత్సవ ర్యాలీలకు సీఈసీ గ్రీన్ సిగ్నల్..
సిద్ధూతో మొదలు:
మొత్తంగా పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమిని విశ్లేషించుకుంటే.. అన్ని వేళ్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ వైపే చూపెడుతున్నాయి. దానికి కారణం, సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీ అంతర్గత కుమ్ములాటలను సిద్ధూ బహిరంగంగా ప్రదర్శించడమే. సీఎంగా అమరీందర్ వైదొలగిన అనంతరం.. సిద్ధూ సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్నాడు. అయితే అధిష్టానం మాత్రం చరణ్జీత్ చన్నీని సీఎంగా ప్రకటించింది. దీంతో చిన్నబుచ్చుకున్న సిద్ధూ ఎన్నికల ర్యాలీలో తన అసహనాన్ని బాహాటంగా వ్యక్త పరిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై పంజాబ్ ప్రజల్లో చిన్న చూపు ఏర్పడింది. అంతే కాదు..చన్నీ, సిద్ధూ తమకు నచ్చిన వారికి టికెట్లు ఇవ్వాలంటూ ఒకరిపైఒకరు విమర్శలు చేసుకున్నారు.
Also read: Sonu Sood : సోనూ సూద్ సోదరి పరాజయం
దీంతో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఏర్పడ్డాయని ప్రజలకు అర్ధమైంది. అప్పటికే అమరీందర్ పాలనతో విసిగివేసారిన పంజాబ్ ఓటర్లు.. కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. ఇది సరిపోదన్నట్టు కెప్టెన్ అమరీందర్ కాంగ్రెస్ ను వీడి లోక్ కాంగ్రెస్ అనే పార్టీ పెట్టి.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చాడు. కెప్టెన్ పోయినా.. చన్నీ పార్టీని చక్కబెడతారనే ఆశతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానంకు సిద్ధూ రూపంలో గండం ఎదురైంది. దీంతో పంజాబ్ కాంగ్రెస్ డీలా పడిపోయింది. పార్టీనే సమన్వయ పరుచుకోలేని నేతలు పాలనను కొనసాగిస్తారా అనే సందేహాలతో ఓటర్లు ఇతర పార్టీల వైపు చూశారు. పంజాబ్ కాంగ్రెస్ లో దిగ్గజాలుగా వెలుగొందిన ఈ ముగ్గురు నేతలు.. నేడు చీపురు(ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల గుర్తు) ఊడ్పుతో పత్తాలేకుండా పోయారు.
Also read: Telangana Politics : తెలంగాణపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్?