Dharmana Prasada Rao : రాజకీయ జీవితానికి విశ్రాంతి అవసరమనిపిస్తోంది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 3రోజుల కిందట సీఎం జగన్ ని కలిసి ఇదే విషయం చెప్పానన్నారు. అయితే, ఈసారి పోటీలో ఉండాలంటూ సీఎం అంటున్నారని తెలిపారు. పార్టీని కష్టకాలంలో వదిలి వెళ్లడం సరికాదని సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు.
”రాజకీయ జీవితానికి విశ్రాంతి అవసరమనిపిస్తోంది. పార్టీ కోసం పని చేస్తానని సీఎంకు చెప్పా. ఈసారి పోటీలో ఉండాలని సీఎం అంటున్నారు. పార్టీ కష్టకాలంలో వదిలేశానని అపవాదునాపై రాకూడదు. ఈసారి నన్ను ఎంపీకి పోటీ చేసి మా బాబుని అసెంబ్లీకి పంపిద్దామని నాతో సీఎం అడిగారు. అంతకుముందే మా అబ్బాయిని ఈసారి నేను రెస్ట్ తీసుకుంటాను నువ్వు పోటీ చేస్తావా అని అడిగాను. వద్దు నాన్న నేను ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ తట్టుకోలేను. నువ్వైతేనే సమర్ధుడవు అని మా అబ్బాయి అన్నాడు.
ముఖ్యమంత్రి మళ్లీ నన్ను పోటీ చేయమనొచ్చు. నేను సిద్దపడవచ్చు. ఏది జరిగినా అంతిమంగా గెలిపించాల్సిన వారు ప్రజలు. అందుకే నేను అన్ని కుల సంఘాలను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుoటున్నాను” అని మంత్రి ధర్మాన అన్నారు.