Ministers: పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్కు ‘పద్మశ్రీ’ అవార్డు వచ్చేలా కృషి చెయ్యాలని కేంద్ర ప్రభుత్వానికి ఈమేరకు సిఫార్సు చెయ్యాలంటూ.. కర్ణాటక ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. నలభై ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోయిన పునీత్కు పద్మశ్రీ ఇవ్వాలని కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ అభిప్రాయపడ్డారు.
పునీత్ బతికున్నప్పుడే పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఉండాల్సిందని, దురదృష్టవశాత్తు పునీత్ మన మధ్య లేకపోయినా.. మనం ఆయన్ని గౌరవించుకోవల్సిందేనని అన్నారు.
మరో మంత్రి.. పర్యాటక రంగాన్ని చూసుకునే ఆనంద్సింగ్ కూడా పునీత్ సేవలు.. సమస్త మనవాళికి మంచి చేసిన వ్యక్తి పునీత్ అని, నటుడిగానే కాకుండా, సమాజానికి సేవలు అందించిన వ్యక్తిగా పునీత్కి పద్మశ్రీ దక్కే అర్హత ఉందని అన్నారు. పద్మశ్రీని ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఆనంద్ కోరారు.
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా పునీత్కి పద్మశ్రీ సిఫార్సు అనేది ఏకగ్రీవం అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే, పద్మ అవార్డులకు ఎప్పుడు, ఏ రంగాల వ్యక్తులను సిఫారసు చేయాలనే దానిపై కొన్ని నియమాలు ఉన్నాయని అన్నారు.
అంతకుమందు సిద్ధరామయ్య కూడా పునీత్కు పద్మశ్రీ ప్రదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్లో కోరారు.