SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు రెండు కీలక ప్రకటనలు చేసింది. అందులో ఒకటి పాన్-ఆధార్ అనుసంధానం. రెండోది డిజిటల్ లావాదేవీల చార్జీల గురించి.
ఎప్పటిలానే నిరంతరాయ బ్యాంకింగ్ సేవలను పొందేందుకు వెంటనే పాన్-ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని తన కస్టమర్లకు ఎస్బీఐ సూచించింది. ఒకవేళ లింక్ పూర్తి చేయకుంటే.. పాన్ కార్డు పని చేయకుండా పోతుందని స్పష్టం చేసింది. అలాంటి కార్డులను లావాదేవీల సమయంలో పొందుపరచొద్దని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే వెంటనే పాన్-ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని ప్రకటనలో తెలిపింది.
Smartphones: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లు
కరోనా నేపథ్యంలో పాన్-ఆధార్ లింకింగ్ గడువును కేంద్రం 2022 మార్చి 31 వరకు పొడిగించింది. సాధారణ బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ ఖాతా తెరవాలన్నా, నగదు జమ చేయాలన్నా.. పాన్ తప్పనిసరన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పాన్-ఆధార్ అనుసంధానం చేయని వారు incometax.gov.in వెబ్సైట్లోని అవర్ సర్వీసెస్లోకి వెళ్లి అనుసంధానం చేసుకోవచ్చు.
సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్దారుల డిజిటల్ లావాదేవీలకు సంబంధించి ఎస్బీఐ మరో ప్రకటన చేసింది. డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ లావాదేవీలపై 2020 జనవరి 1 నుంచి ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. 2017-2020 మధ్య జన్ధన్ ఖాతాదారుల నుంచి ఎస్బీఐ రూ.254 కోట్లు వసూలు చేసిందని, అందులో రూ.90 కోట్లు మాత్రమే వినియోగదారులకు రిఫండ్ చేసినట్లు వార్తలొచ్చాయి.
Belly Fat : బాన బొజ్జ ప్రమాదకరమా? పరిష్కారం ఏంటంటే..
దీనిపై ఎస్బీఐ స్పందించింది. సీబీడీటీ ఆదేశాల మేరకు 2020 జనవరి 1 నుంచి 2020 సెప్టెంబర్ 14 వరకు వసూలు చేసిన మొత్తాలను రీఫండ్ చేసినట్లు బ్యాంక్ తెలిపింది. అంతకుముందు వసూలు చేసిన ఛార్జీలు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించే చేసినట్లు వివరించింది. ప్రస్తుతానికి డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టంచేసింది. ఏటీఎం నుంచి నాలుగు నగదు లావాదేవీల వరకు ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది.