Hyderabad Pubs : హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 దాటిన తర్వాత సౌండ్ పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ లోని పది పబ్బులు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మ్యూజిక్ పెట్టొద్దని ఆదేశించింది. న్యూ ఇయర్ ఈవెంట్స్ లోనూ రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
పబ్ లపై హైకోర్టు తీర్పును కాలనీవాసులు స్వాగతిస్తున్నారు. పబ్ లను పూర్తిగా కాలనీ నుంచి తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము దాఖలు చేసిన పిటిషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పబ్ ల కారణంగా తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు వాపోయారు. పెద్ద పెద్ద శబ్దాలతో పబ్ నిర్వాహకులు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని, రాత్రి వేళ కూడా హంగామా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలతో తమ బాధలు తీరినట్లేనని హర్షం వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు.
మరోవైపు న్యూఇయర్ సెలబ్రేషన్స్ కు హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ రోజు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే సెలబ్రేషన్స్ కు అనుమతి ఇచ్చారు. అంతేకాదు.. పబ్బుల్లో మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన సమయం వరకే మద్యం అమ్మకాలు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసులు హెచ్చరించారు. ఇక పబ్బుల్లో కానీ స్పెషల్ ఈవెంట్స్ లో కానీ అశ్లీల నృత్యాలు చేసినా, అధిక శబ్దాలు వచ్చేలా పాటలు పెట్టినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్స్, పబ్బులలో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలు రాకుండా చూసుకోవాలన్నారు. సామర్థ్యం కంటే ఎక్కువగా ఈవెంట్స్ పాస్ లు ఇవ్వడం, పబ్స్ లోకి పర్మిషన్ ఇవ్వడం వంటివి చేయకూడదని పోలీసులు చెప్పారు.