అరుదైన నిజాం నగల ధగధగలు మరోసారి ఢిల్లీ వాసులను అలరిస్తున్నాయి.
ఢిల్లీ : అరుదైన నిజాం నగల ధగధగలు మరోసారి ఢిల్లీ వాసులను అలరిస్తున్నాయి. హస్తినలో నిజాం ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. నేషనల్ మ్యూజియంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ ఫిభ్రవరి 18 సోమవారం ఈ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించారు. ఇలాంటి అరుదైన ప్రదర్శనల ద్వారా దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఈ మ్యూజియంలో నిజాం నగలను ప్రదర్శించడం ఇది మూడోసారి. తొలిసారి 2001లో, రెండోసారి 2007లో ఢిల్లీలో రెండుస్లారు ప్రదర్శించారు. హైదరాబాద్ లో కూడా రెండు సార్లు ఆభరణాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ఆభరణాల్లో వజ్రాలు పొదిగిన కంకణాలు, గాజులు, చెవిపోగులు, కవచాలు, బొటనవేలి ఉంగరాలు, పాకెట్ వాచీ, నెక్లెస్ లు, వడ్డాణం, బెల్టుల వంటి 173 రకాల నగలు ఉన్నాయి. వీటిలో కళ్లు చెదిరే 184.75 క్యారెట్ల జాకబ్ డైమండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాల్లో ఇది ఒకటి. ఫిభ్రవరి 19 మంగళవారం నుంచి మే 5 వ తేదీ వరకు వీటి సందర్శనకు అనుమతిస్తారు.
గతంలో ఈ ఆభరణాలు నిజాం ట్రస్టుల ఆధీనంలో ఉండేవి. అయితే 1995లో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన పోరాటం ద్వారా రూ.218 కోట్లు వెచ్చించి వీటిని సేకరించింది. 2001 జూన్ 29 వరకు అత్యంత విలువైన ఈ సంపదను రిజర్వు బ్యాంకులో భద్రపరిచింది. తర్వాత పటిష్టమైన భద్రతతో నేషనల్ మ్యూజియంకు తరలించారు.