జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రం చేపట్టి ప్రజలెవ్వరూ రారనీ..కనీసం పార్టీ నేతలు కూడా రారని..కనీసం 10మంది మాత్రమే వస్తారనీ.. జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేదనీ.. పార్టీ నిర్మాణం కూడా బాగాలేదనీ దీంతో.. పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టినా ఎవ్వరూ రారనీ వ్యాఖ్యానించారు.
అందుకే తాను కూడా వేరే పనులపై ఉండి కాకినాడలో పవన్ చేపట్టిన ‘ రైతు సౌభాగ్య దీక్షకు’ వెళ్లలేదని తెలిపారు. ప్రతీ చిన్న విషయానికి ధర్నాలు, సభలు పెట్టటం సరికాదనీ ఈ విషయం పవన్ కు తెలీదని ఎద్దేవా చేశారు. ఇటువంటి పనులు చేస్తే ఇప్పటికే ప్రజల్లో ఆదరణ లేకుండా పోయిందనీ ఇదే కొనసాగితే ముందు ముందు పవన్ సభలకు ఏమాత్రం ఆదరణ లేకుండా పోతుందని అన్నారు. కాగా.. రైతు సౌభాగ్య దీక్షకు రాపాక రాకపోవటంతో పవన్ కళ్యాన్ రాపాకపై ఆగ్రహం వ్యక్తంచేశారనీ షోకాజ్ నోటీసు కూడా ఇచ్చినట్లుగా సమాచారం.
అంతేకాదు గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అంశంపై సీఎం జగన్ పై రాపాక ప్రశంసలు కురింపిచటం వంటి పలు విషయాలపై పవన్ రాపాకపై ఆగ్రహంతో ఉన్నారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నేతలు పవన్ పై వ్యక్తిగత దూషణలు చేస్తుంటే రాపాక మాత్రం సీఎం జగన్ తో పాటు వైసీపీ భజన చేస్తుండటం జనసేన వర్గాలు కూడా రాపాకపై ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం.