రాజధాని విశాఖ : ముందుగా తరలించేది ఈ శాఖనే

విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న ప్రభుత్వం.. వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా మున్సిపల్‌ శాఖను విశాఖకు తరలించబోతోంది. సెక్రటేరియట్, సీఎం

  • Publish Date - January 9, 2020 / 01:47 AM IST

విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న ప్రభుత్వం.. వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా మున్సిపల్‌ శాఖను విశాఖకు తరలించబోతోంది. సెక్రటేరియట్, సీఎం

విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న ప్రభుత్వం.. వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా మున్సిపల్‌ శాఖను విశాఖకు తరలించబోతోంది. సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్‌ తరలింపుపై స్పష్టతతో ఉన్న ప్రభుత్వం.. శాఖల కార్యాలయాలపైనా దృష్టి సారించింది. ఈ నెలాఖరులోగా పలు శాఖలను విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

అమరావతి నుంచి మున్సిపల్‌ శాఖ తరలింపునకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. ఇప్పటికే, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే విశాఖకు చేరుకున్న బొత్స.. విశాఖలోనే వరుస సమీక్షలు, సమావేశాలు పెడుతున్నారు. అటు అధికారులు కూడా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ నుంచి లీజుకు తీసుకున్న బిల్డింగ్ లు, ఖాళీ లీజు భూముల వివరాలను బయటకు తీస్తున్నారు. సచివాలయాన్ని విశాఖకు తరలిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు.. ముందస్తు చర్యలు ప్రారంభించారు. అవసరమైన భవనాలను సమకూర్చుకునే పని నెల రోజుల్లో పూర్తికావాలని మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు గడువు విధించినట్టు సమాచారం. మున్సిపల్‌ శాఖ ఆదేశాల నేపథ్యంలో జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు భవనాలను గుర్తించే పనిలో ఉన్నారు. 

ప్రభుత్వానికి సంబంధించి కీలక శాఖలు విశాఖ వస్తుండడంతో.. మున్సిపల్‌ శాఖపరంగా వివిధ డిపార్ట్‌ మెంట్లకు ఎన్ని భవనాలు అవసరమవుతాయి, ఎంత విస్తీర్ణం కావాల్సి ఉంటుందనే దానితోపాటు ఆయా భవనాలు ఏ ప్రాంతంలో ఉంటే బాగుంటుందనే దానిపై ఆ శాఖ ఉన్నతాధికారులు ఓ ప్రణాళిక రూపొందించుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ కోసం వీఎంఆర్‌డీఏ కాంప్లెక్స్‌లోని తొమ్మిదో అంతస్థు, అలాగే పురపాలక శాఖ కార్యదర్శి, సీడీఎంఏ, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌, ప్రజారోగ్య విభాగం చాంబర్ల కోసం ఎనిమిదో అంతస్థు ఉంటే బాగుంటుందని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. వీఎంఆర్డీఏ భవనంలోని కొన్ని అంతస్థులు ఖాళీగా ఉండటంతో పురపాలకశాఖ ఇక్కడే ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, అధికారుల కార్యాలయాలు, వారి నివాసాల కోసం మధురవాడ, రుషికొండ, సాగర్‌ నగర్‌ ప్రాంతాల్లో కనీసం లక్ష చదరపు అడుగుల వైశాల్యం కలిగిన భవనాలను గుర్తించాలని మున్సిపల్‌ శాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో మధురవాడ సమీపంలోని శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌, హరిత అపార్ట్‌మెంట్‌ వంటి చోట్ల ఖాళీగా ఉన్న భవనాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ అక్కడ అద్దె భవనాలు దొరక్కపోతే రుషికొండ, సాగర్‌ నగర్‌, ఎండాడ వంటి ప్రాంతాల్లో గుర్తించాలని సూచించినట్టు తెలిసింది.

* విశాఖ నుంచి వీలైనంత త్వరలో పరిపాలన ప్రారంభం
* జనవరి నెలాఖరులోపు పని పూర్తి చేయాలనుకుంటున్న ప్రభుత్వం
* మొదటగా మున్సిపల్‌ శాఖ విశాఖకు తరలింపు
* ఇతర శాఖలకు భవనాలు గుర్తించే పనిలో అధికారులు
* వీఎంఆర్‌డీఏ కాంప్లెక్స్‌లోని 9వ అంతస్థులో మంత్రి బొత్స పేషీ 
* 8వ అంతస్థులో మున్సిపల్‌ శాఖ ఆఫీస్

* విశాఖలోనే వరుస సమీక్షలు, సమావేశాలు 
* ఖాళీ ప్రభుత్వ భవనాలు, లీజుకు ఇచ్చిన బిల్డింగ్ ల ఆరా
* నెల రోజుల్లో భవనాలు గుర్తించాలని ఆదేశం
* ఎన్ని భవనాలు, ఎంత విస్తీర్ణంలో కావాలనే దానిపై ప్రణాళిక 
* మధురవాడ, రుషికొండ, సాగర్‌నగర్‌లో భవనాల గుర్తింపు
* శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌, హరిత అపార్ట్‌మెంట్‌ 
Also Read : ట్రంప్ కామెంట్స్: అమెరికా టార్గెట్ యుద్ధం కాదు.. ఇరాన్‌ను వదిలేది లేదు