Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో అరుదైన దృశ్యం.. విజయమ్మ కోసం లోకేష్.. పవన్ కోసం జగన్

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. నారా లోకేష్, వైఎస్ జగన్ చేసిన ట్వీట్లు ఆసక్తికర చర్చకు దారి తీశాయి.

nara lokesh birthday wishes to ys vijayamma and ys jagan tweet about pawan kalyan health

Nara Lokesh : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడి ఉంది. ప్రజా సమస్యల మీద పోరాడే విషయంలో అధికార, విపక్షాలు అనే తారతమ్యం ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా మాత్రం అందరూ అందరితో సత్సంబంధాలే కలిగి ఉంటారు. ఉండేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న రెండు సంఘటనలను పరిశీలిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. వైఎస్ విజయమ్మ కోసం మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం మాజీ సీఎం జగన్ చేసిన పోస్ట్ నెట్టింట ఆసక్తికర డిబేట్ కు తెర తీసింది. ఇంతకు దేని గురించి వీరు ట్వీట్ చేశారంటే..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్.. వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయమ్మకు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు. వీరిద్దరూ చేసిన ట్వీట్ లు ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీశాయి.

రాజకీయాల పరంగా చూసుకుంటే.. గత కొన్నాళ్లుగా ఏపీలో అధికార, విపక్ష నేతల మధ్య ఘాటు రాజకీయ విమర్శలు, ఆరోపణలు వస్తోన్న తరుణంలో ఇలాంటి ట్వీట్లు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. విభేదాలు ఉన్నా.. వ్యక్తిగత అంశాల్లో పరస్పరం గౌరవం చూపడం రాజకీయాల్లో అరుదుగా కనిపించే పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో ఇలాంటి సీన్స్ చాలా అరుదు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.