జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని టీడీపీ నేతలు కలిశారు. రాజధాని ప్రాంత మహిళలపై దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఎంపీ గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం, పోలీసులపై గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 144 సెక్షన్ ఉగ్రవాదులు, మావోయిస్టులపై వాడాలి..కానీ ఇక్కడ రైతులపై ప్రయోగిస్తున్నారని వాపోయారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. ఆదివారం (జనవరి 12, 2020) గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని టీడీపీ నేతలు కలిశారు.
రాజధాని ప్రాంత మహిళలపై దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఎంపీ గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ వెల్లడించారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ రైతులు, మహిళలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని గల్లా జయదేవ్ అన్నారు. రాజధాని పరిస్థితులను కమిషన్ ను దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దాడికి సంబంధించిన ఆధారాలు వారికి సమర్పించామని తెలిపారు.
మహిళలపై జరిగిన లాఠీఛార్జ్ ఘటనపై నిజనిర్ధారణ కోసం అమరావతికి వచ్చిన జాతీయ మహిళా కమిషన్ బృందం ఇవాళ విచారణ జరపనుంది. కమిషన్ ప్రతినిధులు… ఇవాళ తుళ్లూరు, మందడంలో పర్యటించనుంది. రాజధాని ఉద్యమంలో మహిళలపై జరిగిన దాడి ఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.
రాజధాని తరలింపుపై ఏపీ రగిలిపోతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసనలతో 29 గ్రామాలు హోరెత్తుతున్నాయి. 26వరోజు కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు మహా ధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలేదీక్షలు కంటిన్యూ అవుతున్నాయి. ఉద్దండరాయునిపాలెంలోను వివిధ గ్రామాలకు చెందిన రైతులు నిరసనలు తెలుపుతున్నారు.