రాక్షసుడు : శ్రావణి, మనీషాలనే కాదు.. కల్పనను వీడే చంపాడు

  • Publish Date - April 30, 2019 / 05:41 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి, మనీషాలనే కాదు కల్పన అనే బాలికను కూడా తానే హతమార్చినట్టు శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. ముగ్గురు బాలికలను తానే చంపానని శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు. టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారిస్తున్న సమయంలో డిగ్రీ విద్యార్థిని మనీషా కేసు వెలుగులోకి వచ్చింది. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మనీషా డెడ్ బాడీ దొరికింది.

ఈ రెండు హత్యల్లోనూ శ్రీనివాస్ రెడ్డే నేరస్తుడు అని భావిస్తున్న సమయంలోనే.. నాలుగేళ్ల క్రితం అదృశ్యం అయిన కల్పనను అతడే హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యలు సంచలనం రేపుతున్నాయి. పోలీసుల విచారణలో ఇంకా ఎన్ని దారుణాలు బయటపడుతాయో చూడాలి.

హాజీపూర్ గ్రామంలో అమ్మాయిల మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. అదృశ్యమైన అమ్మాయిలు దారుణ హత్యకు గురయ్యారు. నెల రోజుల క్రితం అదృశ్యం అయిన డిగ్రీ విద్యార్థిని మనీషా, నాలుగు రోజుల క్రితం స్కూల్ కి వెళ్లి మిస్ అయిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి, నాలుగేళ్ల క్రితం కనిపించకుండా పోయిన కల్పన.. మర్డర్ అయ్యారు. ఆ ముగ్గురిని తానే చంపానని శ్రీనివాస్ రెడ్డి అంగీకరించాడు. శ్రీనివాస్ రెడ్డికి చెందిన బావిలోనే శ్రావణి, మనీషాల మృతదేహాలు బయటపడ్డాయి. మాయమాటలు చెప్పి వారిని బావి దగ్గరికి తీసుకొచ్చిన శ్రీనివాస్ రెడ్డి.. వారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాలను బావిలో పూడ్చిపెట్టాడని పోలీసలు చెబుతున్నారు. ఎంత లోతు బావి అయినా.. అందులోకి దిగడం, తిరిగి పైకి రావడంలో శ్రీనివాస్ రెడ్డి సిద్ధహస్తుడు అని తేలింది.

మంగళవారం (ఏప్రిల్ 30,2019) హాజీపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనివాస్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు అతడి ఇంటిపై దాడి చేశారు. ఇంటిని ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న పాకకు నిప్పు పెట్టారు. పోలీసులు వచ్చేసరికి ఇంటిని ధ్వంసం చేశారు.

ట్రెండింగ్ వార్తలు