తరగతి గదిలో దారుణం..టీచర్‌ ని చంపేశాడు

  • Publish Date - February 22, 2019 / 10:22 AM IST

తమిళనాడు రాజధాని చెన్నైకి 200 కి.మీ. దూరంలోని కుడలూరు జిల్లాలో శుక్రవారం (ఫిబ్రవరి 22,2019) ఓ యువకుడు తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో ఎస్‌. రమ్య(23) అనే యువతిని దారుణంగా హత్య చేశాడు. యువతి గాయత్రి మెట్రిక్యులేషన్‌ స్కూల్లో గణితం టీచర్‌గా పని చేస్తోంది. 5వ తరగతికి గణితం బోధిస్తున్న సమయంలో యువకుడు క్లాస్‌రూంలోకి ప్రవేశించి రమ్య పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తరగతి గది అంతా రక్తసిక్తమైంది. విద్యార్థులు భయంతో వణికిపోయారు. 

పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రమ్యను హత్య చేసిన వ్యక్తిని రాజశేఖర్‌గా పోలీసులు గుర్తించారు. రమ్య, రాజశేఖర్‌ కాలేజీ ఫ్రెండ్స్‌ అని, 6 నెలల క్రితం రమ్యతో తన వివాహం జరిపించాలని ఆమె తల్లిదండ్రులను అతడు కోరాడు. ఇందుకు రమ్య తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. అప్పట్నుంచి పగ పెంచుకుని   ఆమెను హత్య చేశాడు. రమ్యను హత్య చేసిన అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సోదరికి రాజశేఖర్‌ మేసేజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.