Mixing Mango Curd : పెరుగు+మామిడి పండు కలిపి తింటున్నారా.. ఎంత పెద్ద ప్రమాదంలో పడతారో తెలుసా..!
Mixing Mango Curd :
- Dharani Pilli
- Updated on- May 27, 2026 / 09:28 PM IST
Mixing Mango and Curd harm Your Health here is the reasons in details
Mixing Mango Curd : వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎంత ఉన్నా ఓర్చుకుని మరీ ఈ సీజన్ కోసం ఎదురు చూసేది ఈ కాలంలో లభించే మామిడి పండ్లు, తాటి ముంజలు, వేసవి సెలవుల కోసమే. ఇక పండ్లకే రారాజు మామిడి అంటే ఇష్టపడని వారు చాలా అరుదు. వేడి చేస్తుందని చెప్పినా సరే.. తినడం మాత్రం మానుకోరు. ఎందుకంటే వేసవి అయిపోతే మళ్లీ మామిడి కంటికి కనిపించదు. అందుకు వీలైనన్ని మామిడి పండ్లు ఆరగించాలని చూస్తారు. అయితే చాలా మంది పెరుగన్నంలో మామిడి పండు నంజుకుని తింటారు. మరి ఇలా తినడం మంచిదేనా.. దీని వల్ల సమస్యలు వస్తాయా అనే దానిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..
పెరుగు, మామిడి పండును కలిపి అస్సలు తినకూడదంటున్నారు వైద్య నిపుణులు. వాస్తవంగా పెరుగు వల్ల శరీరానికి చలవ చేస్తే.. మామిడి పండు శరీరంలో వేడిని కలిగిస్తుంది. విరుద్ధ గుణాలు కలిగిన రెండింటినీ కలిపి తింటే టాక్సిన్స్ (విష పదార్థాలు) ఏర్పడి.. ఆ తర్వాత అవి చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. కనుక ఈ రెండింటినీ కలిపి తినవద్దని సూచిస్తున్నారు.
అలానే మామిడి పండు తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి తినకూడదు:
నీళ్లు:
మామిడి పండు తినగానే వెంటనే నీళ్లు తాగవద్దంటున్నారు. అలా చేస్తే కడుపునొప్పి, ఎసిడిటీ (కడుపులో మంట) వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. అందుకే మామిడి పండు తిన్న తర్వాత కనీసం అరగంట ఆగి, ఆ తర్వాతే నీళ్లు తాగాలని చెబుతున్నారు.
కాకరకాయ:
మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయ కూర తింటే వికారం, వాంతులు అయ్యే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాక.. శ్వాస (ఊపిరి) తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చని చెబుతున్నారు.
కూల్ డ్రింక్స్:
వేసవిలో కూల్ డ్రింక్స్ విపరీతంగా తాగుతుంటారు. అలా కూల్ డ్రింక్ తాగగానే మామిడి తిన్నా.. లేదంటే మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ తాగినా ప్రమాదం అంటున్నారు. దీని వల్ల శరీరంలో ఒకేసారి చక్కెర స్థాయిలు (Sugar Levels) విపరీతంగా పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.
కృత్రిమంగా మగ్గించిన పండ్లతో వచ్చే అనారోగ్య సమస్యలు:
రసాయనాల వినియోగం:
ప్రస్తుతం మార్కెట్లో లభించే మామిడి పండ్లలో చాలా వరకు రసాయనాలు వేసి మగ్గబెట్టినవే. మామిడి పండ్లను వేగంగా మగ్గించేందుకు కాల్షియం కార్బైడ్ను ఉపయోగిస్తున్నారు. ఇది ‘ఎసిటిలిన్’ అనే వాయువును విడుదల చేసి పచ్చికాయలను త్వరగా పసుపు రంగులోకి మారుస్తుంది.
పోషకాల లోపం:
మామిడి పండ్లను మగ్గబెట్టడానికి ఎక్కువగా కాల్షియం కార్బైడ్ వాడతారు. అయితే ఇది కేవలం పండు రంగును మాత్రమే మారుస్తుంది. దీనివల్ల సహజంగా జరగాల్సిన చక్కెర మార్పులు, పోషక విలువల అభివృద్ధి జరగవు. పండ్లలో ఫ్రక్టోజ్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల సహజమైన తీపి, వాసన, రుచి లోపిస్తాయి.
ఆరోగ్య సమస్యలు:
ఇలా రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లను తింటే గొంతు గీరగా అనిపించడం, కడుపులో అసౌకర్యం, నోట్లో చేదు రుచి రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
విషపూరిత మలినాలు:
కాల్షియం కార్బైడ్లో ఉండే ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి మలినాలు మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.
