దిశ కేసులో నిందితులను చటాన్పల్లి ఎన్కౌంటర్లో కాల్చి చంపడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
దిశ కేసులో నిందితులను చటాన్పల్లి ఎన్కౌంటర్లో కాల్చి చంపడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని రమ శంకర నారాయణ మెల్కొటే, హెచ్ఆర్ఎఫ్ సభ్యుడు ఎస్.జీవన్ కుమార్లు సంయుక్తంగా దాఖలు చేశారు. పిటిషన్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ పోలీసు కమిషనర్, రాచకొండ పోలీసు కమిషనర్, శంషాబాద్ ఏఎస్పీ, షాద్నగర్ ఎస్హెచ్ఓ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఎన్కౌంటర్పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసి… విశ్వనీయమైన ట్రాక్ రికార్డు ఉన్న రాష్ట్రేతర పోలీసు అధికారులతో సిట్ వేసి విచారణ జరిపించాలని కోరారు.
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఐపీసీ 302 కింద కేసు నమోదు చేయాలన్నారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలన్నారు. పోస్టుమార్టం సందర్భంగా తీసిన వీడియోలను, నివేదికలను భద్రపర్చాలని, వాటి ప్రతులను పిటిషనర్లకు ఇవ్వాలని కోరారు. అలాగే ఫోరెన్సిక్ నివేదికను ఇవ్వాలని, నేరస్థలంలో ఉన్న పోలీసుల వివరాలూ ఇవ్వాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చటాన్పల్లి ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని భావిస్తున్నామని స్పష్టం చేసింది. ఎన్కౌంటర్పై దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం విచారించింది. హైదరాబాద్ ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ నడుస్తున్న అంశంపై తమకు అవగాహన ఉందని… ఈ ఘటనపై దర్యాప్తు జరపడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని భావిస్తున్నట్లు జస్టిస్ బాబ్డే చెప్పారు. ఢిల్లీలోనే ఉంటూ దర్యాప్తు చేస్తారని, హైదరాబాద్లో ఉండబోరని తెలిపారు.
దర్యాప్తు కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీవీ రెడ్డిని సంప్రదించామని, కానీ ఆయన నిరాకరించారని వెల్లడించారు. దాంతో మరెవరినైనా చూస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ… తమ వాదనలు విన్న తర్వాతే ముందుకెళ్లాలని కోరారు.