గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు

కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది.

  • Publish Date - January 30, 2020 / 03:57 AM IST

కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. అటు భారతదేశంలో కూడా కరోనా వైరస్‌ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనాపై అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. ఇప్పటివరకు కరోనా పరీక్షలు పుణేలో నిర్వహిస్తున్నారు. అక్కడకు రక్తనమూనాలను కొరియర్‌ ద్వారా విమానాల్లో పంపిస్తున్నారు. దీంతో ఫలితాలు రావడానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇప్పుడు ఈ ఇబ్బందులేవీ లేకుండా గాంధీ ఆసుపత్రిలోనే నిర్వహించాలని వైద్య యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 

గాంధీ ఆస్పత్రిలో వచ్చే 10 రోజుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు దేశంలోని 10 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో గాంధీ ఆసుపత్రి కూడా ఉంది. కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఇక నుంచి 2 సార్లు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రానికి మార్గదర్శకాలు జారీ చేసింది. 

ఒకసారి రక్త పరీక్ష చేశాక అందులో నెగిటివ్‌ వచ్చినా 48 గంటల్లో మరోసారి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. దీనివల్ల పూర్తిస్థాయిలో కచ్చితత్వం వస్తుందనేది కేంద్రం భావన. ఇప్పటివరకు తెలంగాణలో 10 మంది కరోనా అనుమానంతో ఫీవర్‌ ఆసుపత్రికి వచ్చారు. వారిలో ఐదుగురికి ఎలాంటి లక్షణాల్లేవని నిర్ధారించారు. మరో ఐదుగురి రక్త నమూనాలను పుణేకు పంపించారు. వీరి ఫలితాలు నేడు పుణే నుంచి వస్తాయి.