తెలంగాణ కాంగ్రెస్లో ఎంపీ రేవంత్ రెడ్డి వ్యవహారం రచ్చ రచ్చను రాజేసింది. సీనియర్ నేతలంతా రేవంత్రెడ్డిపై ఫైర్ అవుతున్నారు.గోపన్నపల్లి భూ దందాలపై రేవంత్ రెడ్డిపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై అతను ఇంతవరకూ సమాధానం చెప్పకపోవటం..కనీసం నోరెత్తకపోవటం..పైగా మంత్రి కేటీఆర్ ఫార్మ్ హౌస్ పైకి డ్రోన్ కెమరాను పంపించిన వీడియోలు తీసిన కేసులో డ్రామాలాడంపై పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.
పార్టీలో కనీసం చర్చించకుండా రేవంత్ రెడ్డి ఇటువంటి దుందుడు పనులు చేయటం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు ఎవర్ని అడిగి ఇటువంటి పనులు చేస్తున్నారనీ..పార్టీ ప్రతిష్టను రేవంత్ దెబ్బతీస్తున్నారనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఏమన్నా కార్యక్రమాలు చేపట్టాలి అంటే పార్టీతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటారని అటువంటిది రేవంత్రెడ్డి మాత్రం ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారనీ మండిపడ్డారు.
పీసీసీ ప్రెసిడెంట్ అనుమతి తీసుకోకుండా..కనీసం పార్టీకి ఒక్కమాట కూడా చెప్పకుండా ఇటువంటి పనులు చేస్తూ పార్టీకి చేటు తీసుకొస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఇటువంటి పనులతో కేసుల్లో ఇరుక్కుని కూడా పార్టీ నిబంధనలకు పట్టింకోవటంలేదనీ..రేవంత్ కు పార్టీ బెయిల్ తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పకుండా నాకు అవసరం లేదు..నేను అరెస్ట్ అవుతానని..నేనే తేల్చుకుంటానంటూ ప్రగల్భాలు పలికి జైలుకు పోయాడని విమర్శించారు వీహెచ్.
గోపన్నపల్లిలో రేవంత్ రెడ్డిపై ఆరోపణలు
హైదరాబాద్ శివారుల్లోని గోపన్నపల్లిలో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడితో కలసి తప్పుడు పత్రాలతో అత్యంత ఖరీదైన భూమిని తమ పేరిట మ్యుటేషన్ చేయించుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్ 127లో 10.21 ఎకరాల పట్టా భూమి ఉండగా, అందులో 6 ఎకరాల 7 గుంటల భూమిని రేవంత్రెడ్డి అక్రమ మార్గంలో హస్తగతం చేసుకున్నారని నివేదిక వెల్లడించింది. గోపనపల్లిలోని సర్వే నంబర్ 127లో గల భూమికి సంబంధించి తమకు హక్కు ఉందని, రేవంత్రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కొల్లా అరుణ 2017లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
మంత్రి కేటీఆర్ ఫార్మ్ హౌస్ పైకి డ్రోన్ కెమరాలతో చిత్రీకరణ
మంత్రి కేటీఆర్ ఫార్మ్ హౌస్ పైకి డ్రోన్ కెమరాను పంపించిన కేసులో నార్సింగి పోలీసులు రేవంత్ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం (మార్చి 5) మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో రేవంత్ రెడ్డిని గురువారం (మార్చి 5,2020) మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కోర్టు రేవంత్కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.
కాగా..అరెస్టై జైల్లో ఉన్న మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఆయన హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్ పోలీస్స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్ రద్దు చేయాలని మరో పిటిషన్లో కోరారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున తక్షణం బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు.