ఢిల్లీలో పొంచి ఉన్న భారీ వర్షం.. ఆరంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
- Subhan Ali Shaik
- Published On : January 4, 2021 / 08:26 PM IST
Rains: వారాంతంలో కుండపోత వర్షం ఖాయమంటోంది వాతావరణ శాఖ. ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఆదివారమే దీనిపై స్పందించిన వాతావరణ శాఖ ఉత్తరభారత దేశంలో ఓ మోస్తారు నుంచి తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.
ఈ మేరకు జనవరి 5వరకూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది. మంగళవారం పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పింది. కనీస ఉష్ణోగ్రత 10డిగ్రీల నుంచి 15.8డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండేట్లుగా ఐఎండీ సూచించింది.
ఆదివారం ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలతో ఉష్ణోగ్రత 9.9డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. మరోవైపు గరిష్ఠ ఉష్ణోగ్రత 15.8డిగ్రీల సెల్సియస్ గా ఉంది. అధిక వర్షపాతం కారణంగా పలు చోట్లు నీరు స్తంభించిపోయింది.
వాతావరణ శాఖ చెప్పినట్లుగా ఆదివారం, సోమవారం (పంజాబ్, హర్యానా, ఛండీఘడ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, నార్త్ రాజస్థాన్)లలో అధిక వర్షం కురిసే అవకాశముందని చెప్పారు. సోమవారం పశ్చిమ హిమాలయ ప్రాంతం (జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్, గిల్జిత్-బల్తిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖాండ్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు.
