Positive change in India's internal security in J and K says Amit Shah
Vallabhbhai Patel Jayanti 2022: భారత వ్యతిరేక శక్తులు దేశాన్ని ముక్కలుగానే ఉంచాలన్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టితో శక్తిమంతమైన, సమైక్య భారత్ అవసరాన్ని గుర్తించారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ఇవాళ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. అప్పట్లో దేశాన్ని ఏకం కాకుండా చేసేందుకు కొన్ని శక్తులు ఏ అవకాశాన్నీ వదులుకోలేదని, అయినప్పటికీ, సర్దార్ పటేల్ జునాగఢ్, జమ్మూకశ్మీర్, హైదరాబాద్ ను భారత్ లో కలిపారని గుర్తుచేశారు.
సర్దార్ పటేల్ దేశానికి అందించిన సేవలను విస్మరించడానికి కొందరు ప్రయత్నించినప్పటికీ దేశ ప్రజలు ఆయనను కృతజ్ఞతాభావంతో గుర్తుంచుకున్నారని అమిత్ షా చెప్పారు. సర్దార్ పటేల్ లేనిదే శక్తిమంతమైన, సమైక్య భారత్ సాధ్యం కాకపోయేదని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాచరిక పాలన ఉన్న రాజ్యాలను భారత్ లో కలపడం ఓ సవాలుగా మారిందని చెప్పారు.
ఆ పరిస్థితులను సర్దార్ పటేల్ సమర్థంగా ఎదుర్కొన్నారని అమిత్ షా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం శక్తిమంతమైన, స్వావలంబన కలిగిన దేశంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. గత ఎనిమిదేళ్లలో దేశం ఎన్నో మైలు రాళ్లను అధిగమించిందని అన్నారు. సర్దార్ పటేల్ కలలుగన్న దేశంగా 2047లోపు భారత్ రూపుదిద్దుకుంటుందని చెప్పుకొచ్చారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..