కరోనా కట్టడిలో హైదరాబాద్‌ పోలీసుల కీలక పాత్ర, వైరస్‌ వ్యాప్తికి ఇలా చెక్ పెట్టారు

  • Publish Date - May 3, 2020 / 02:21 AM IST

శాంతి భద్రతల పరిరక్షణ, లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడం, ప్రజలు ఇళ్లలోనే ఉండేలా చూడటమే కాదు కరోనా వైరస్ మహమ్మారి కట్టడిలోనూ హైదరాబాద్ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కంటైన్ మెంట్లతో కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు రాత్రి, పగలు శ్రమిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని, వారి కాంటాక్టులను గుర్తించి, క్వారంటైన్‌ చేయడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడటంలో పోలీసుల పాత్ర ఎనలేనిదని అధికారులు చెబుతున్నారు.

వైరస్‌ వ్యాప్తి చెందకుండా:
నగరంలోని వెస్ట్‌, సౌత్‌తో పాటు ఈస్ట్‌జోన్లలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అత్యధికంగా 49 కరోనా కేసులతో వెస్ట్‌జోన్‌లోని ఆసీఫ్‌నగర్‌ ఠాణా ఏరియా మొదటి స్థానంలో ఉండడంతో అక్కడ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. సమీప ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా వైద్య, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. ముందుకెళ్తున్నారు. ఇక 43 కేసులతో రెండోస్థానంలో సౌత్‌జోన్‌లోని భవానీనగర్‌ ఠాణా పరిధి ఉంది. మొత్తంగా నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని 10 ఠాణాల పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. రెయిన్‌బజార్‌, కుల్సుంపురా, కాలాపత్తార్‌, కంచన్‌బాగ్‌, గోల్కొండ, చాదర్‌ఘాట్‌, కమాటిపురా, డబీర్‌పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

ప్రత్యేక దృష్టి:
అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ నగర పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని గుర్తించడంతో పాటు వారి కాంటాక్టును పట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు ఆయా పోలీస్‌స్టేషన్ల వారీగా పాజిటివ్‌ వచ్చిన వారు, వారి కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఎక్కడైతే కేసులు ఉన్నాయో, ఆ ఇంటి పరిసరాలను కట్టడి చేశారు. ప్రజల దగ్గరకే వెళ్లి సేవలందిస్తున్నారు. 

* మరో 19 కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. దీంతో కొత్తగా ఏర్పాటైన వాటితో కలిపి ప్రస్తుతం 50 కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతున్నాయి. 
* మలక్‌పేట గంజ్‌ను రెడ్‌జోన్‌గా గుర్తించి మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలు, వ్యాపారులకు స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తున్నారు. అయితే కొందరు నగరంలోనే ఉంటుండగా, చాలా మంది వారి స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఫోన్‌ నంబర్లు సేకరించే పనిలో పడ్డారు. వైరస్‌ బారినపడినట్లు గుర్తించిన వారిని క్వారంటైన్‌కు తరలించేందుకు పోలీసుల సహాయాన్ని తీసుకుంటున్నారు.  
* లింగోజిగూడెం డివిజన్‌ భాగ్యనగర్‌ కాలనీకి చెందిన బియ్యం వ్యాపారికి వైరస్‌ సోకడంతో గాంధీకి తరలించారు. 
* బీఎన్‌రెడ్డి నగర్‌లో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వనస్థలిపురంలో మూడు కేసులు నమోదయ్యాయి. సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో జింకలబావి కాలనీలో ఓ కిరాణాషాపు యజమానికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే వనస్థలిపురం రైతు బజార్‌ సమీపంలో అల్లం వ్యాపారిని క్వారంటైన్‌కు తరలించారు. 
* బోడుప్పల్‌ పట్టణ పరిధిలోని రాజశేఖర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. 
* కుందన్‌ బాగ్‌లోని ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌ మన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని వైరస్‌ సోకింది. 108లో అతడితో పాటు అతని భార్యను గాంధీ ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. 
* జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్‌ భరోక నేతృత్వంలోని కేంద్ర బృందం శనివారం ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ వైద్యశాలను సందర్శించింది. కొవిడ్‌-19 * పాజిటివ్‌ కేసుల కోసం అందించే వైద్య సేవలపై ఆరా తీసింది. అయితే ఇంతవరకు కరోనా రోగులు వైద్యశాలకు రాలేదని అక్కడి వైద్యులు కేంద్ర బృందానికి తెలిపారు. అనంతరం కేంద్ర బృందం చర్లపల్లిలోని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గోదాంను సందర్శించింది. 
* నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి దగ్గు, జ్వరం రావడంతో గాంధీకి తరలించారు.

హైదరాబాద్ లో 15 పాజిటివ్‌ కేసులు:
తెలంగాణ వ్యాప్తంగా శనివారం(మే 2,2020) 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,061కి చేరింది. కాగా, శనివారం నమోదైన 17 కేసుల్లో 15 కరోనా కేసులు గ్రేటర్ లో నమోదయ్యాయి. ఇందులో 11కేసులు హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లోనివి కాగా.. మరో నాలుగు మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో నమోదయ్యాయి. జియాగూడలో ఇటీవల కరోనాతో మృతిచెందిన మహిళ కుటుంబంలో మరో ఇద్దరికి, సబ్జీమండిలో కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 29మంది చనిపోయారు. 499మంది కరోనా నుంచి కోలుకున్నారు. 533మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య 37వేల 776కి చేరింది. 10వేల 18మంది కోలుకున్నారు. 26వేల 535మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 1,223మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 34 లక్షల 81 వేల 465 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 21 లక్షల 28 వేల 410. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షల 44 వేల 666 మంది మృత్యువాతపడ్డారు. వ్యాధి నుంచి కోలుకుని 11 లక్షల 8 వేల 389 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.