womens rights activist kamla bhasin passes away : మహిళా హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ప్రముఖ ఉద్యమకారిణి కమ్లా భాసిన్ తన 75 ఏళ్ల కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న కమ్లా భాసిన్ శనివారం (సెప్టెంబర్ 25,2021) తెల్లవారుజామున మూడు గంటల సమంయలో ఢిల్లీలోని సిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. కమ్లా భాసిన్ మరణవార్తను ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి కవితా శ్రీవాస్తవ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కమ్లా భాసిన్ మృతి దేశంలో, దక్షిణాసియాలో మహిళా హక్కుల ఉద్యమానికి తీరనిలోటు అని ఆమె మహిళా ఉద్యమనాయకురాలిగానే కాకుండా పలు రంగాల్లో పేరుగాంచారని కవితా శ్రీవాస్తవ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కమ్లా భాసిన్ మహిళా ఉద్యమకారిణే కాకుండా రచయిత్రిగా, కవయిత్రిగా పేరుగాంచారు. కమ్లా భాసిన్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సోషల్ యాక్టివిస్ట్ హర్ష్ మందేర్, కాంగ్రెస్ కీలక నాయకుడు శశిథరూర్, ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ తదితరులు సంతాపాన్ని తెలిపారు. లక్షల మంది ఇంటర్నెట్ ద్వారా సంతాపాలు తెలియజేస్తున్నారు.
భారత దేశ స్త్రీవాదిగా కమ్లా భాసిన్ గుర్తింపబడ్డారు. మహిళ హక్కుల కోసం ఎనలేని పోరాటం చేశారు. పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా ఆమె గళాన్ని వినిపించేవారు. ఆమె రచనలు సూటిగా పితృస్వామ్యసమాజంపై ఎక్కు పెట్టిన బాణాల్లా ఉండేవి.ఆమె తనను తాను మిడ్ నైట్ జనరేషన్ అని పిలుచుకునేవారు.
కమ్లా భాసిన్ సంగత్ – ఎ ఫెమినిస్ట్ నెట్వర్క్,క్యుంకి మెయిన్ లడ్కీ హూన్, ముజే పద్నా హై అనే కవితకు బాగా ప్రసిద్ధిపొందాయి. ఆమె 2002 లో UN లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి..సంగత్ ను ఏర్పాటు చేశారు. సంగత్ కు ఆమె వ్యవస్థాపక సభ్యురాలు,సలహాదారు కూడా.
రాజస్థాన్ లోని భాసిన్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ చదివారు. ఆ తరువాత ఫెలోషిప్తో పశ్చిమ జర్మనీలోని మున్స్టర్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ ఆఫ్ డెవలప్మెంట్ చదివారు. తరువాత, ఆమె ఒక సంవత్సరం పాటు బాడ్ హోన్నేఫ్లోని అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం జర్మన్ ఫౌండేషన్ యొక్క ఓరియంటేషన్ సెంటర్లో టీచింగ్ చేశారు.తరువాత ఇండియాకు తిరిగి రావాలని అక్కడ నేర్చుకున్న వాటిని ఇండియాలో అమలు చేయాలని అనుకున్నారు.
భారతీయ సమాజంలోను.. పాలనలో కూడా వివక్ష ఎలా ఉందో గ్రహించారు. ఈ పితృస్వామ్య భావజాలం సమాజంపై ఆమె తన కవితలతోను..రచనలతోను ప్రశ్నల్ని ఎక్కుపెట్టేవారు. స్త్రీవాదం రచనలతో ఆమె రచనలు ఈటెల్లాంటి పదాలతో సమాజాన్నిప్రశ్నిస్తుండేవి.