కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక ఆదాయం తగ్గిపోయింది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఆఫీసులన్నీ బంద్ కావడంతో ప్రీమియం చెల్లింపుల విషయంలో పాలసీదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పలు శాఖలు తమ పాలసీదారులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రీమియం చెల్లింపు గడువుని పొడిగిస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఆ దిశగా అవకాశం ఇచ్చాయి. తాజాగా పోస్టల్ శాఖ అలాంటి ఊరటనిచ్చే ప్రకటన చేసింది.
తపాలా శాఖ తమ జీవిత బీమా పాలసీదారులకు శుభవార్త వినిపించింది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రీమియం చెల్లింపుల గడువును పొడిగించింది. 3 నెలల వరకు అవకాశం ఇచ్చింది. తపాలా జీవిత బీమా (పీఎల్ఐ), గ్రామీణ తపాలా జీవిత బీమా (ఆర్పీఎల్ఐ) పాలసీదారులు మార్చి, ఏప్రిల్, మే నెలల ప్రీమియంలను జూన్ 30 వరకు చెల్లించవచ్చని తెలిపింది. ఇందుకు ఎలాంటి జరిమానాలు, చార్జీలు ఉండబోవని స్పష్టం చేసింది. దీంతో 3 కోట్ల మందికిపైగా లబ్ధి చేకూరింది. అధికారిక లెక్కల ప్రకారం మార్చిలో 64.62 లక్షల పీఎల్ఐ పాలసీలు, 2.5 కోట్ల ఆర్పీఎల్ఐ పాలసీలు మనుగడలో ఉన్నాయి.
మార్చి, ఏప్రిల్ ఎల్ఐసీ ప్రీమియంలపైనా..
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లోని ప్రీమియంల చెల్లింపు గడువును ఎల్ఐసీ 30 రోజులు పెంచింది. లాక్డౌన్ మధ్య పాలసీదారుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు ఫిబ్రవరి ప్రీమియంల చెల్లింపు గడువుకున్న గ్రేస్ పీరియడ్ మార్చి 22 తర్వాత కూడా ఉన్నైట్లెతే అవి ఈ నెల 15 వరకు చెల్లించవచ్చని ఎల్ఐసీ ప్రకటించింది.
అలాగే ఆరోగ్య పరిస్థితులతో నిమిత్తం లేకుండా పాలసీలను ఆన్లైన్లో పునరుద్ధరించుకోవచ్చని, సర్వీస్ చార్జీ లేకుండా ఎల్ఐసీ డిజిటల్ పేమెంట్ సదుపాయాల ద్వారా ప్రీమియంలను చెల్లించుకోవచ్చని చెప్పింది. డిజిటల్ పేమెంట్స్ విధానాల ద్వారా ప్రీమియంలను చెల్లించవచ్చని వెల్లడించింది.