అబ్దుల్ కలామ్‌తో చిరు.. సెలూన్‌లో సంజయ్..

  • Publish Date - October 15, 2020 / 05:50 PM IST

Abdul Kalam: భారత దేశం గర్వించదగిన శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి నేడు (అక్టోబర్ 15). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను స్మరించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అబ్దుల్ కలామ్‌ను గుర్తు చేసుకున్నారు.


‘మనం గర్వించదగిన శాస్త్రవేత్తలలో ఒకరు, మన దేశ గొప్ప రాష్ట్రపతులలో ఒకరు, గొప్ప మానవతావాదులలో ఒకరు అయిన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నా. ఆయన ఆలోచనలు, అద్భుతమైన జ్ఞానం కొన్ని తరాలలో స్ఫూర్తిని నింపుతాయి’ అని పేర్కొంటూ గతంలో కలాంతో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి.

సెలూన్‌లో సంజుభాయ్..
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రస్తుతం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. ముంబైలోనే ఉంటూ కీమోథెరపీ చేయించుకుంటున్నారు. మధ్య మధ్యలో తన భార్య, పిల్లలను చూసేందుకు దుబాయ్ వెళుతున్నారు. తాజాగా ముంబై తిరిగి వచ్చిన సంజయ్ హెయిర్ స్టైలిష్ట్ ఆలిమ్ హకీమ్ సెలూన్‌కు వచ్చారు.

హెయిర్ కట్ తర్వాత బయట ఉన్న మీడియా వ్యక్తులతో సరదాగా మాట్లాడారు. చికిత్సలో భాగంగా తన తలపై ఏర్పడిన మచ్చను చూపించారు.‘ఇప్పుడు నేను అనారోగ్యంతో లేను. దయచేసి అలా రాయకండి’ అని సరదాగా వ్యాఖ్యానించారు సంజూ బాబా.