Renu Desai : రేణు దేశాయ్ పై బూతులు.. తాట తీస్తోన్న పోలీసులు.. ఇప్పటికి ఎంత మందిని అరెస్ట్ చేశారంటే..!

Renu Desai : రేణు దేశాయ్ మీద అసభ్యకర కామెంట్స్ చేసిన వారిలో నేడు మరొకరిని అరెస్ట్ చేశారు.

cyberabad police arrested one more person over abusive comments on actress renu desai

  • రేణు దేశాయ్ పై అసభ్యకర కామెంట్స్
  • గుంటూరు వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • కొనసాగుతూనే ఉంటాయంటున్న నటి

Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ చాన్నాళ్లుగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. గతంలో ఆమె రెండో వివాహం చేసుకోబోతున్నట్లు పోస్ట్ చేసిన తర్వాత ఈ ట్రోల్స్ మరింత పెరిగాయి. నేటికీ కూడా చాలా మంది ఆమెని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేస్తుంటారు. కళాకారులు సున్నిత మనస్కులని.. దయచేసి ఇలా ట్రోల్స్ చేయడం తగదని ఆమె ఎన్నిసార్లు వేడుకున్నా కొందరు మూర్ఖులు మాత్రం మారడం లేదు. ఆమెకు సోషల్ మీడియాలో వేధింపులు తప్పడం లేదు.

తాజాగా కూడా ఇలానే ట్రోల్స్ బారిన పడ్డారు రేణు దేశాయ్. వారి వేధింపులు భరించలేక.. సైబరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి.. ఇప్పటికే ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నేడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతడిని గుంటూరుకు చెందిన చెన్నయ్య అనే వ్యక్తిగా గుర్తించారు.

మరి రేణు దేశాయ్ మీద ట్రోల్స్‌కు కారణం ఏంటంటే.. వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రేణు దేశాయ్ స్పందిస్తూ.. “పది వీధి కుక్కల్లో తొమ్మిది మంచివే. ఎక్కడో ఒక కుక్క మనుషులపై దాడి చేసి గాయపరిచిందని.. కుక్కలన్నింటినీ ఇబ్బంది పెట్టడం సరికాదు. ఒకవేళ ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఏదైనా కుక్క మీకు ఇబ్బంది కలిగిస్తే.. అధికారులకి లేదా మా స్వచ్ఛంద సంస్థకి సమాచారం ఇవ్వండి మేం దాన్ని తీసుకెళ్తాం” అంటూ కామెంట్స్ చేశారు.

అయితే రేణు దేశాయ్ వ్యాఖ్యలపై చాలా మంది తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. కొందరు హద్దులు దాటి అసభ్య పదజాలాన్ని వాడారు.. బూతులు తిట్టారు. ఈ వీధి కుక్కలు రేణు దేశాయ్, అలాగే ఆమె పిల్లలపై దాడి చేయాలి.. వారి ప్రైవేట్ భాగాలపై దాడి చేస్తే.. అప్పుడు వారికి నొప్పి తెలుస్తుంది అంటూ చాలా అసభ్యంగా దూషించారు. మరికొందరు నోటితో పలకలేని మాటలు వాడుతూ.. సోషల్ మీడియా వేదికగా ఆమెని దూషించారు. దీంతో సహనం నశించిన రేణు దేశాయ్.. తనను ట్రోల్ చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రేణు దేశాయ్‌ని ట్రోల్ చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారు.