అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ విషయమై ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అలా వార్తలు వచ్చిన ప్రతిసారీ.. జాన్వీ కపూర్ ఫ్యామిలీ వాటిని ఖండిస్తూనే ఉంది. శ్రీదేవిలా జాన్వీని కూడా తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారని భావించి, టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎందరో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేయాలని చూశారు. చిరు, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ చేయాలని, అందులో జాన్వీ కపూర్ని నటింపచేయాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆ ప్రయత్నాలు అటకెక్కిన తర్వాత కొద్ది రోజులకు పూరీ జగన్నాధ్ తను చేస్తున్న ‘ఫైటర్’ మూవీతో జాన్వీని టాలీవుడ్కి పరిచయం చేయాలనిఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె బిజీగా ఉన్నానంటూ పూరి ఆఫర్ను తిరస్కరించింది. కానీ ఇప్పుడు ఆమె టాలీవుడ్ ఆఫర్స్ వదులుకుని తప్పు చేశానని ఫీలవుతుందట.
దీనికి కారణం లేకపోలేదు. ఆమెకి టాలీవుడ్ ఆఫర్స్ వచ్చినప్పుడు బిజీ అని చెప్పి చేసిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదలవుతున్నాయి. వెండితెరపై తన వైభవాన్ని చూసుకోవాలనుకున్న ఆమె కోరిక అస్సలు నెరవేరలేదు. ఇప్పుడామె నటించిన చిత్రాలన్నీ ఓటీటీ బాటే పడుతుండడంతో జాన్వీ బాగా డిజప్పాయింట్ అవుతుందట. అందుకే టాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను ఎందుకు వదులుకున్నానా? అని ఎంతో ఫీలవుతుందట. అయితే ఎక్కడైనా ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి కదా! థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేనప్పుడు ఏ నిర్మాతలైనా.. చేసేది అదే కదా..! దీనికి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అంటూ ఆమె సన్నిహితులు జాన్వీని సముదాఇస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.