ఏపీ సీఎం చంద్రబాబు.. ఒడిశా ఫొని తుపాను బాధితులకు అండగా నిలిచారు. వారికి ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చారు. తుపాను బాధితులను ఆదుకోవడం
ఏపీ సీఎం చంద్రబాబు.. ఒడిశా ఫొని తుపాను బాధితులకు అండగా నిలిచారు. వారికి ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చారు. తుపాను బాధితులను ఆదుకోవడం మానవ ధర్మం అని చంద్రబాబు అన్నారు. ఫొని తుపానుతో ఒడిశా కకావికలం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తుల వల్ల కలిగే నష్టం తీవ్రత అపారంగా ఉంటుందన్నారు. ఇప్పటికే ఒడిశాలో చెట్ల తొలగింపునకు సామగ్రిని, విద్యుత్ పునరుద్దరణకు సిబ్బందిని పంపామని చెప్పారు. ఒడిశా ప్రభుత్వానికి అన్ని విధాల సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి తుపాను బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలు ఒడిశా తుపాను బాధితులకు అండగా నిలవాలని కోరారు.
ఫొని తుపాను ఒడిశా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. పూరీ పట్టణాన్ని ధ్వంసం చేసింది. తుపాను బీభత్సానికి పూరీ పట్టణంలోనే 21 మంది చనిపోయారని కలెక్టర్ ప్రకటించారు. ఇళ్ల గోడలు కూలిన ఘటనలో 9 మంది చనిపోయారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆస్తి నష్టం భారీగా ఉందన్నారు. లక్షల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయని కలెక్టర్ ప్రకటించారు. విద్యుత్, టెలికాం సేవలు పూర్తిగా స్తంభించి పోయాయి.