Delhi Liquor Scam: తాను అవినీతిపరుడైతే లోకంలో నిజాయిపరులే ఉండరట.. కేజ్రీవాల్ చిత్రమైన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రెండు సంస్థలు వ్యవహరిస్తున్నాయంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న ఆయన.. తాజాగా ఆ సంస్థల్లో పనిచేస్తున్నవారు తప్పుడు ఆధారాలు రూపొంది కోర్టుకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు దర్యాప్తు సంస్థలపై తాను తొందరలోనే కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు
- tony bekkal
- Published On : April 15, 2023 / 03:11 PM IST
Arvind Kejriwal
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం పూర్తిగా అవాస్తవమని, కేవలం ఆరోపణల ఆధారంగా నిర్మితమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అయితే ఈ మాట చెప్తూనే ఆయన చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను అవినీతి చేయలేదు, నిజాయితీపరుడినని చెప్పుకోవడం వేరే. కానీ ఒకవేళ తాను తప్పు చేస్తే అసలు ప్రపంచంలో ఇంకెవరూ నిజాయితీపరులే ఉండరని అన్నారు. లిక్కర్ స్కాం కేసులో తనకు సీబీఐ సమన్లు వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందిస్తూ తానేదో అత్యంత నిజాయితీపరుడినని చెప్పుకునే ప్రయత్నం చేయబోయారు. అందులో భాగంగా తన నిజాయితీని ప్రపంచం మొత్తంతో పోల్చుకుంటూ వారిని నిజాయితీలేని వారని అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక సీబీఐ, ఈడీలపై సైతం కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రెండు సంస్థలు వ్యవహరిస్తున్నాయంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న ఆయన.. తాజాగా ఆ సంస్థల్లో పనిచేస్తున్నవారు తప్పుడు ఆధారాలు రూపొంది కోర్టుకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు దర్యాప్తు సంస్థలపై తాను తొందరలోనే కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. లిక్కర్ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను జైలులో హింస్తున్నారని ఆరోపించారు.
కేవలం ఆరోపణల ఆధారంగా కేసులు వేయడం, అరెస్ట్ చేయడం సరికాదని కేజ్రీవాల్ అన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్తే… ఆయను అరెస్ట్ చేస్తారా అంటూ విమర్శలు గుప్పించారు. 100 కోట్లు ఇచ్చారనే ఆరోపణల మీద సీబీఐ, ఈడీలు పలుమార్లు దర్యాప్తు చేసినప్పటికీ, అసలేమీ దొరకలేదని, అయినప్పటికీ తమ పార్టీ నేతలను అరెస్ట్ చేశారని అన్నారు.
