Monsoon Sessions: ఢిల్లీ వర్షాకాల సమావేశాల హడావుడి షురూ
ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల హడావుడి మొదలైపోయింది. మరో రెండ్రోజుల్లో అంటే సోమవారం నుంచి సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11గంటలకు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.
- Subhan Ali Shaik
- Updated on- July 17, 2021 / 07:50 PM IST
Monsoon Sessions
Monsoon Sessions: ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల హడావుడి మొదలైపోయింది. మరో రెండ్రోజుల్లో అంటే సోమవారం నుంచి సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11గంటలకు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు.
మీటింగ్కు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలియజేయనున్నారు. ఈ మేరకు సభా కార్యకలాపాలను అడ్డుకోకుండా కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలంటూ అన్ని పార్టీల ఎంపీలను కేంద్రం కోరనుంది.
ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా లోక్సభా పక్ష నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారు. పార్లమెంట్ సమావేశాలకు సహకరిస్తూ.. కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలియజేయనున్నారు. మరోవైపు సాయంత్రం మోడీ అధ్యక్షతన ఎన్డీఏ పక్ష నేతల సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
కాంగ్రెస్ లోక్ సభ ఎంపీలతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సోనియాగాంధీ భేటీ అవుతారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు సోనియా. ధరల పెరుగుదల, నిరుద్యోగం, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల, భారత్-చైనా సరిహద్దు ఘర్షణలు, జమ్మూకశ్మీర్లో అంశాలు, కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, రాఫెల్ కుంభకోణం అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.
