Manipur Violence: పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ ప్రకంపనలు.. వాయిదా తీర్మానాలు ఇచ్చిన విపక్షాలు
ప్రధాని మోదీ సభకు రావాలని సైతం ఖర్గే డిమాండ్ చేశారు. కాగా, ఖర్గేకు విపక్ష పార్టీల నేతలు మద్దతు పలికారు. ప్రధాని వెంటనే రావాలని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ గట్టిగా కేకలు వేశారు
- tony bekkal
- Published On : July 20, 2023 / 01:11 PM IST
Parliament Monsoon Session: మణిపూర్ అంశం రాజ్యసభను కుదిపివేసింది. సభ ప్రారంభం కాగానే విపక్ష పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అయితే తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని సభా నాయకుడు పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం చర్చకు సిద్ధంగా వున్నందున వాయిదా తీర్మానాలు తిరస్కరిస్తున్నామని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న అంశాలను రద్దు చేసి వెంటనే మణిపూర్ అంశంపైనే చర్చ జరపాలని ప్రతిపక్ష నేత మల్లిఖర్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ సభకు రావాలని సైతం ఖర్గే డిమాండ్ చేశారు. కాగా, ఖర్గేకు విపక్ష పార్టీల నేతలు మద్దతు పలికారు. ప్రధాని వెంటనే రావాలని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ గట్టిగా కేకలు వేశారు. వెంటనే చర్చ చేపట్టాలని ప్రధాని సభకు రావాలని ప్రతిపక్ష సభ్యుల పట్టు పట్టారు, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. ఇక ఈ అంశం అటు లోక్సభనూ కుదిపివేస్తోంది. లోక్సభలోనూ దీనిపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి విపక్షాలు. మొత్తానికి తీవ్ర వర్షంలో కూడా మణిపూర్ సెగలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
వాయిదా తీర్మానం అంటే.. ప్రజాప్రాముఖ్యం ఉన్న ఆకస్మిక లేదా హఠాత్ సంఘటనలను చర్చించడానికి స్పీకర్ అనుమతితో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది సభ్యుల మద్ధతు అవసరం. వాయిదా తీర్మానం అనుమతి పొందితే సభలో మిగిలిన వ్యవహారాలన్నీ వాయిదా వేస్తారు. ఇది శాసన ప్రక్రియలలో ఉపయోగించే అతి ముఖ్యమైన సాధనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఒక అత్యుత్తమ సాధనంగా పరిగణించబడుతోంది. ఎందుకంటే ఇది సభ సాధారణ పనితీరును అడ్డుకుంటుంది.
