Sanatan Row: సనాతన ధర్మం (Sanatana Dharma)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తల నరికిన వారికి పది కోట్ల రూపాయలు బహుమానంగా ఇస్తానంటూ ప్రకటించిన అయోధ్య సాధువు పరమహంస ఆచార్య (Paramhans Acharya) మరో ప్రకటన చేశారు. మరో అడుగు ముందుకు వేసి ఉదయనిధి తలను తానే నరికేస్తానని ప్రకటించారు. ఇక దీనితో పాటు ఉదయనిధి తనకు పది కోట్లు సరిపోకుంటే మరో పది కోట్లు ఇస్తానని ఆయన ప్రకటించారు.
ఉదయనిధి తన వ్యాఖ్యలతో దేశంలోని 100 కోట్ల మంది ప్రజానీకం మనోభావాలను దెబ్బతీశారని ఆయన చెప్పారు. దేశంలో ఎలాంటి అభివృద్ధి జరిగినా సనాతన ధర్మం వల్లే జరిగిందని, ఉదయనిధి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘సనాతన ధర్మ చరిత్ర చదవాలని ముందుకు అతడికి నేను సూచిస్తున్నాను. అంతే కాకుండా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతడు క్షమాపణ చెప్పాలి. లేకపోతే అతడు ముఖ్యమంత్రి కొడుకు అయినా సరే శిక్ష పడుతుంది. అతడి తల నరికేందుకు పది కోట్లు సరిపోకపోతే, మరో పది కోట్లు పెంచుతాను. అవసరమైతే నేనే ఆ తల నరికేస్తాను’’ అని పరమహంస అన్నారు.
గతంలో కరుణానిధికి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. కరుణానిధి తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని అప్పట్లో ఒక సాధువు ప్రకటించారు. అయితే 100 కోట్లు తెచ్చిచ్చినా తన జుట్టు కూడా దువ్వుకోలేనని కరుణానిధి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇక అదే విషయాన్ని తాజాగా స్టాలిన్ గుర్తు చేస్తూ.. తన తలకు పది కోట్లు రూపాయలు ఏమీ అవసరం లేదని, రూ.10 రూపాయల దువ్వెన చాలని వ్యాఖ్యానించారు. ఇలాంటి బెదిరింపులు తమకు కొత్తేమీ కాదని, వాటికి భయపడేది లేదని అన్నారు. తమిళ్ కోసం తన తలను రైలు ట్రాక్పై ఉంచిన కరుణానిధి మనవడినని అన్నారు.