Prashant Kishor cryptic tweet amid buzz of reunion with Bihar CM Nitish Kumar
Bihar Big Twist: గత రెండేళ్లుగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య మంచినీళ్లు చల్లినా నిప్పుల్లానే రుగులుతున్నాయి. ఈ విషయంలో నితీశ్ కొంత పట్టింపు లేకుండా ఉన్నప్పటికీ.. ప్రశాంత్ కిశోర్ అయితే సమయం దొరికినప్పుడల్లా నితీశ్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అలాంటిది ఉన్నట్టుండి ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. అది కూడా కాస్త చనువుగా, సానుకూల అవగాహనతో కలవడం విశేషం. దీంతో మళ్లీ వీరు ఒకటి కాబోతున్నారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కొందరైతే వీరు ఇప్పటికే కలిసి పోయారని కూడా అంటున్నారు.
ఇవి పక్కన పెడితే.. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం నితీశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత కాలం క్రితం కూడా బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం కావాలంటూ పీకే పలుమార్లు చెప్పారు. అప్పుడు రాహుల్, పవార్, కేజ్రీవాల్ అంటూ పీకే పర్యటనలు చేశారు. ఇప్పుడు వారినే నితీశ్ కలుస్తున్నారు. వీరి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చినప్పటికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల అంశంలో ఒక అవగాహనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో రాజకీయాలు చర్చించలేదని, సాధారణమైన భేటీయేనని నితీశ్ చెప్పారు. అంతే కాకుండా.. పీకే విమర్శల గురించి ప్రశ్నించగా.. అవేవీ తనను ఇబ్బంది పెట్టలేదని నితీశ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
బుధవారం సాయంత్రం బిహార్ రాజధాని పాట్నాలో సుమారు 45 నిమిషాల పాటు నితీశ్, పీకే సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని జేడీయూ మాజీ నేత పవన్ వర్మ ఏర్పాటు చేయడం గమనార్హం. జేడీయూ నుంచి పీకే బయటికి వచ్చిన సందర్భంలోనే పవన్ వర్మ సైతం వచ్చారు. దీంతో వీరిద్దరూ మళ్లీ జేడీయూతో జతకట్టబోతున్నారా? లేదంటే బీజేపీ ప్రత్యామ్నాయంలో నితీశ్తో కలిసి పని చేయబోతున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
OBC Reservations: ఓబీసీ రిజర్వేషన్లను 14 నుంచి 27 శాతానికి పెంచిన జార్ఖండ్ ప్రభుత్వం