ఎన్నికల్లో గెలిచేందుకు ఏం చేయడానికైనా వెనుకాడరు రాజకీయ నాయకులు. ప్రత్యేకించి పంజాబ్ లాంటి రాష్ట్రంలో యూత్ ఓట్లకే ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందులో భాగంగానే యూత్ను ఆకర్షించేందుకు పంజాబ్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని యువతకు స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలన్న వినూత్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. దీని కోసం పంజాబ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది. టెండర్ దక్కించుకున్న వారు రెండు నెలల్లోగా ఫోన్లను అందించాల్సి ఉంటుంది.
మొదటిదశలో ప్రభుత్వ పాఠశాలల్లో 11,12 తరగతులు చదువుతున్న ఫోన్లు లేని విద్యార్థినులకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత మిగిలిన వారికి అందజేస్తారు. ప్రభుత్వం పంపిణీ చేసే ఫోన్లలో లేటెస్ట్ అప్డేట్స్ అందుబాటులో ఉండనున్నాయని అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. రాష్ట్రంలో సాంకేతికతను మరింతగా విస్తరించడంతో పాటుగా యువతకు ఉద్యోగ, విద్య అవకాశాల గురించి సమాచారం అందిస్తామన్నారు.