corona vaccine ఇస్తే కచ్చితంగా కరోనాను నివారించవచ్చు. కానీ దేశంలో ఎంతమందికి ఇవ్వాలి. అందరికీ ఒకేసారి ఇవ్వలేనప్పుడు ముందుగా ఎవరికి ఇవ్వాలనేదానిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. వచ్చే ఏడాది టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో కసరత్తు మొదలుపెట్టింది. ముందుగా దేశంలో 20 నుంచి 25 కోట్ల మందికి ఇవ్వాలని ప్లాన్ చేసింది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. దేశ జనాభాలో దాదాపు 18 శాతం మందికి టీకా ఇచ్చే అవకాశం ఉంది.
మొదటి విడత టీకాలు అందరికీ అందే అవకాశం లేదు. ప్రాధాన్యత ప్రకారం టీకా ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రాలు కూడా తమ ప్రాధాన్యతను తెలపాలని కేంద్రం ఆదేశించింది. దీనికి సంబంధించిన నమూనా (ఫార్మాట్)ను రాష్ట్రానికి పంపించినట్లు వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి. నెలాఖరులోగా రంగాల వారీగా పేర్లను పంపిస్తారు. కేంద్ర లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో దాదాపు 70 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ మొదటి విడతలో ఇచ్చే అవకాశాలున్నాయని ఒక వైద్యాధికారి తెలిపారు.
డాక్టర్లకు తొలి విడతలో..:
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ వేస్తారు. ఇది టాప్ ప్రియారిటీగా చెబుతున్నారు. అలాగే గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేస్తారు. అనంతరం ఉపాధ్యాయులకు వేస్తారని తెలిసింది. ఎందుకంటే పిల్లలతో ఎక్కువగా కలిసి మెలిసి ఉండేవారు ఉపాధ్యాయులు కాబట్టి వారిని రెండో ప్రాధాన్యతగా భావిస్తున్నారు.
యాక్టర్లకు రెండో విడతలో..:
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉండే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను.. వైరస్కు ఎక్కువ ప్రభావితమయ్యే వర్గాలను గుర్తిస్తారు. సినీ రంగంలో పనిచేసే వారికి కూడా మొదటి విడతలోనే టీకా వేసే అవకాశాలున్నాయి. వ్యవసాయం తర్వాత ఐటీ, పారిశ్రామిక రంగాలు రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నందున వాటిల్లోని ముఖ్యమైన వాటిని గుర్తిస్తారు. నిర్దేశిత టీకాల సంఖ్యను బట్టి ఆయా రంగాల్లో ఎంత మంది పనిచేస్తున్నారనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీస్తుంది. వారందరినీ మొదటి విడత టీకాకు అర్హులుగా తేల్చుతారని చెబుతున్నారు.