Rohit Sharma: ఇండియన్ క్రికెట్ టీం రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఇంగ్లాండ్ తో మరికొద్ది రోజుల్లో టెస్ట్ మ్యాచ్ జరగనుండగా పాజిటివ్ రావడం విచారకరం. బీసీసీఐ అధికారిక ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని రిలీజ్ చేసింది. శనివారం జరిపిన ర్యాపిడ్ యాంటీజన్ పరీక్షా ఫలితాల్లో రోహిత్ శర్మకు కొవిడ్ పాజిటివ్ అని తెలిసింది. ప్రస్తుతం హోటల్లో ఐసోలేషన్లోనే మెడికల్ టీం పర్యవేక్షణలో ఉంటున్నాడు.
జులై 1 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్కు ముందు 4 రోజుల టూర్ గేమ్లో లీసెస్టర్షైర్తో తలపడుతున్న జట్టులో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఆడాల్సి ఉంది. వార్మప్ మ్యాచ్లో భాగంగా గురువారం జరిగిన తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన రోహిత్, శనివారం భారత్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు రాలేదు. ఇన్నింగ్స్లో ఔటయ్యే ముందు అతను 25 పరుగులు మాత్రమే నమోదు చేశాడు.
ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇంతకుముందు రోహిత్ కెప్టెన్సీలో ఈ ఏడాది శ్రీలంకపై స్వదేశంలో 2-0తో టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా. ఎడ్జ్బాస్టన్లో జరిగే మ్యాచ్లోగా అతను కోలుకుంటే, స్వదేశానికి దూరంగా ఉన్న భారత జట్టు కెప్టెన్గా ఇది అతనికి మొదటి టెస్ట్ మ్యాచ్ అవుతుంది.
Read Also: విరాట్, రోహిత్ల ఫామ్పై బేఫికర్ అంటోన్న గంగూలీ
విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత్ గతేడాది ఇంగ్లాండ్పై 2-1 ఆధిక్యంలో ఉంది. భారత క్యాంప్లో కోవిడ్ వ్యాప్తి కారణంగా ఐదోది చివరిదైన టెస్ట్ మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. BCCI, ECB ఈ ఏడాది మిగిలిన టెస్ట్ మ్యాచ్ను మళ్లీ నిర్వహించాలని అనుకున్నాయి.
ఈ పర్యటనలో భారత్ టెస్టు మ్యాచ్తో పాటు మూడు టీ20లు, మూడు వన్డేలు కూడా ఆడనుంది.