cm revanth announces free electric scooters for college girls how to apply when will they distribute selection process required documents full details here
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని కాలేజీ విద్యార్థినులకు త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేస్తామని తెలిపారు. అలానే మహిళలకు ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించడమే తమ ప్రభుత్వ ధ్యేయం అన్న రేవంత్ రెడ్డి, దీనిలో భాగంగా నగరంలో వేల సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. అలానే కాలేజీ అమ్మాయిలకు కూడా ఎలక్ట్రిక్ స్కూటీలను ఇస్తామని తెలిపారు.
కాలేజీ అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్.. అసెంబ్లీ ఎన్నికల హామీల్లో ప్రకటించారు. తెలంగాణలో 18 ఏళ్లు నిండి కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తాజాగా కాలేజీ చదువుతున్న విద్యార్థినులకు త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని సీఎం తెలిపారు. త్వరలోనే కాలేజీకి వెళ్లే చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందజేసే ఆలోచనతో ఉన్నామని చెప్పుకొచ్చారు.
ఎన్నికల హామీ అయిన ఎలక్ట్రిక్ స్కూటీల గురించి సీఎం రేవంత్ తాజాగా మరోసారి ప్రకటన చేయడంతో త్వరలోనే వీటిని పంపిణీ చేస్తారని భావిస్తున్నారు. అయితే ఏ ప్రాతిపదికన వీటిని పంపిణీ చేస్తారు, అర్హులను ఎలా ఎంపిక చేస్తారు… ముందుగా పైలెట్ ప్రాజెక్ట్గా ఒక జిల్లా, నియోజకవర్గంలో మాత్రమే పంపిణీ చేస్తారా.. లేదంటే రాష్ట్రమంతా ఒకేసారి పంపిణీ చేస్తారా అనే దాని గురించి చర్చించుకుంటున్నారు. 18 ఏళ్లు నిండిన యువతులు అంటే డిగ్రీ చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ ఎలా
అయితే డిగ్రీ చదివే వారికి మాత్రమే ఈ స్కూటీలు పంపిణీ చేస్తారా.. లేదంటే ఇతర కోర్సులు చదివే వారికి కూడా ఇస్తారా అనే అనుమానాలు తెర మీదకు వచ్చాయి. దీంతో అర్హుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతుంది.. స్కాలర్షిప్ ఇవ్వడానికి వర్తించే నియమాలే స్కూటీ పంపిణీకి కూడా వర్తిస్తాయా.. ప్రైవేటు కాలేజీల్లో చదివే వారికి కూడా స్కూటీలు పంపిణీ చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే త్వరలోనే వీటిపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది అంటున్నారు.
ఏం డాక్యుమెంట్స్ అడుగుతారు
సాధారణంగా రాష్ట్రంలో ఏదైనా సంక్షేమ పథకానికి అర్హత సాధించాలంటే కచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. కాలేజీల్లో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అయితే ఆదాయం, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కావాలి. స్కూటీ పంపిణీకి కూడా ఇవే నియమాలు వర్తిస్తాయని.. వీటి ఆధారంగానే అర్హులను ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. అన్నింటికి మించి క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్లే అమ్మాయిలకే ఈ స్కూటీలు పంపిణీ చేస్తారని సమాచారం. ముందుగా గవర్నమెంట్ కాలేజీల్లో చదివే విద్యార్థినులకే స్కూటీలు పంపిణీ చేస్తారని అధికారులు అంటున్నారు.
రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన విద్యార్థినుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వీరందరికీ స్కూటీల పంపిణీ అంటే ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడుతుంది. అందుకే అందరికీ ఒకేసారి కాకుండా విడతలవారీగా స్కూటీలు పంపిణీ చేస్తారని తెలుస్తోంది. అటు ఎలక్ట్రిక్ టూ వీలర్లపై కేంద్రం ఫేమ్-2 పథకం కింద రాయితీ అందిస్తోంది. దీని ప్రకారం ఒక్కో స్కూటీ ధరలో గరిష్టంగా 40 శాతానికి సమానంగా సబ్సిడీ అందిస్తోంది. కేంద్రం ఇచ్చే రాయితీని వాడుకుని.. రాష్ట్రం నుంచి కొంత ఖర్చు చేసి ఈ స్కూటర్లను పంపిణీ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్కో స్కూటీకి సగటున రూ. 50 వేల వరకు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ఈ మొత్తం భారం ప్రభుత్వ ఖజానాపై పడనుంది.