Micro Finance Case : మైక్రో ఫైనాన్స్ వసూళ్లలో మంగ్లీ పాత్రపై వెలుగులోకి సంచలన విషయాలు
Mangli Micro Finance Case : మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మంగ్లీ పాత్రపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- Dharani Pilli
- Updated on- April 17, 2026 / 03:55 PM IST
cyberabae eow dcp mutyam reddy about singer mangli involve ment in micro finance case
- మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం
- మంగ్లీ పాత్రపై సంచలన విషయాలు
- మొత్తం రూ.12 కోట్ల వరకు మోసం
Micro Finance Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రమావత్ మధుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సింగర్ మంగ్లీపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో EOW డీసీపీ ముత్యంరెడ్డి.. 10టీవీతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మంగ్లీ పాత్రపై సంచలన విషయాలు వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘శుభక్షేత్ర వెంచర్ పేరిట పెట్టుబడిదారులను మోసం చేసిన కేసులో రమావత్ మధును అరెస్ట్ చేశాము. శుభక్షేత్ర వెంచర్లో 5 లక్షల డిపాజిట్ స్కీమ్ పేరుతో మధు జనాలను మోసం చేశాడు. రమావత్ మధుతో పాటు మరో నలుగురు ఈ కేసులో ఉన్నారు.. వారు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నాం’’ అని తెలిపారు.
‘‘5 లక్షలు పెట్టుబడి పెడితే 102 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో పాటు ఇంట్రెస్ట్ ఇస్తా అన్నాడు. వీరి మాటలు నమ్మి సుమారు 132 మంది పెట్టుబడులు పెట్టారు. వీరి నుండి రూ.12 కోట్లు వరకు వసూలు చేసినట్టు మా ప్రాథమిక విచారణలో తేలింది. పెట్టుబడులు తీసుకున్నారు కానీ ఎవరికీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు.. ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదు’’ అని తెలిపారు.
‘‘మియాపూర్లో కార్యాలయం ఏర్పాటు చేసి నమ్మకం కల్పించాడు నిందితుడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం దామరగిద్దలో 16 ఎకరాల్లో వెంచర్ అంటూ ప్రచారం చేశాడు. వాస్తవానికి దామరగిద్దలో ఎలాంటి ల్యాండ్ కొనుగోలు చేయలేదు.. ల్యాండ్ కేవలం పేపర్లలో మాత్రమే ఉంది. మధుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తాం.. దాని ద్వారా మోసంపై మరింత క్లారిటీ వస్తుంది. వసూలు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్లిందో దర్యాప్తు చేస్తున్నాం’’ అన్నారు. ఈ కేసులో మధుతో పాటు మరో నలుగురు ఉన్నారు.. ఈ కేసుతో ఇప్పటివరకు సింగర్ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు.. మరిన్ని విషయాలు విచారణలో తెలుస్తాయన్నారు.
