HMWSSB Fine : మంచిగా చెప్తే చెవికి ఎక్కదు.. ఇప్పుడు తిక్క కుదిరిందా.. రూ.10 వేలు ఫైన్.. మిగతా వాళ్లకైనా బుద్ది వస్తుంది..
HMWSSB Fine : హైదరాబాద్ జలమండలి అధికారులు ఓ వ్యక్తికి దిమ్మ తిరిగే షాకిచ్చారు.
- Dharani Pilli
- Updated on- May 27, 2026 / 03:32 PM IST
hmwssb issue rs 10000 fine to banjarahills man for drinking water wastage
HMWSSB Fine : వేసవి కాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ మహానగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి. మున్సిపల్ వాటర్ సరఫరా సమయం కూడా తగ్గిస్తుంటారు. చాలా మంది ఇళ్ల యజమానులు మున్సిపల్ నల్లాలకు మోటార్లు బిగించి.. నీటిని తోడేస్తుంటారు. నీటి కొరత కారణంగా చాలా మంది ట్యాంకర్లను ఆశ్రయిస్తుంటారు. ఈ సారి ఫిబ్రవరి నుంచే ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది. ఓవైపు నగరవాసులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బదులు ఎదుర్కొంటుంటే మరోవైపు కొందరు మాత్రం విచ్చలవిడిగా నీటిని వృథా చేస్తుంటారు. కావాలనే నల్లాకు పైప్ తగిలించి ఇంటి ముందు ప్రాంగణం, వాహనాలు శుభ్రం చేయడం వంటి పనులు చేస్తూ.. నీళ్లను వృథా చేస్తుంటారు. నీటిని ఇలా వృథా చేయవద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం మారడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా బంజరాహిల్స్ ప్రాంతంలో ఓ వ్యక్తిని నీటిని వృథా చేసినందుకు గాను రూ.10 వేల జరిమానా విధించారు.
హైదరాబాద్ జలమండలి.. నీటి వృథాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనవసరంగా నీటిని వృథా చేసేవారిపై కఠిన చర్యలకు సైతం వెనకాడటం లేదు. దీనిలో భాగంగానే తాజాగా జలమండలి అధికారులు బంజారాహిల్స్లో నీటిని వృథా చేసిన ఒక వ్యక్తికి ఏకంగా రూ. 10 వేల జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఆరెంజ్ ట్రీ ఫర్నిచర్ షాప్ దగ్గర ఈ ఘటన జరిగింది. తాగడానికి వినియోగించ నీటితో.. ఒక వ్యక్తి ఫర్నిచర్ షాపు ముందు ప్రాంగణాన్ని కడుగుతున్నాడు. విసయం తెలసుకున్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. తాగునీటిని ఇతర అవసరాలకు వాడుతూ.. వృథా చేస్తున్న ఆ వ్యక్తిని గుర్తించి అక్కడికక్కడే 10 వేల రూపాయల ఫైన్ విధించారు.
ఈ సందర్భంగా జలమండలి అధికారులు నగర ప్రజలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో సరఫరా అయ్యే తాగు నీటిని కేవలం తాగడానికి, గృహ అవసరాలకు మాత్రమే వాడాలన్నారు. రోడ్లు కడగడానికి, వాహనాలు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. నీటి వృథాను అరికట్టడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు తప్పవని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది.
