MGNREGA Workers Free Insurance : ఉపాధి సిబ్బందికి తెలంగాణ సర్కార్ శుభవార్త.. రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉచితంగా..
MGNREGA Workers Free Insurance : తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కార్మికులకు శుభవార్త చెప్పింది.
- Dharani Pilli
- Updated on- April 24, 2026 / 09:59 AM IST
mgnrega upadhi workers GET free insurance Upto rs 40 lakh to rs 1 10 crore in telangana
- ఉపాధి హామీ సిబ్బందికి
- రేవంత్ సర్కార్ శుభవార్త
- రూ.40 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు బీమా
MGNREGA Workers Free Insurance : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న సిబ్బందికి సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉచితంగా లబ్ధి చేకూర్చేందుకు గాను కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పని చేస్తోన్న సుమారు 3,800 మందికి పైగా ఎఫ్టీఈ, కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూర్చేందుకు తెలంగాణ గవర్నమెంటు ముందడుగు వేసింది. ప్రతి ఉద్యోగికి వారి జీతం ఆధారంగా రూ.40 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఉచిత వ్యక్తిగత, ప్రమాద బీమా కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం, ప్రతీ ఉద్యోగికి వారి జీతం ఆధారంగా రూ.40 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఉచిత వ్యక్తిగత, ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఇందుకోసం ఉపాధి హామీ ఉద్యోగితో పాటు ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు.
ఎస్బీఐ కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ (సీఎస్పీ) పథకం, స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (ఎస్జీఎస్పీ) పథకం కింద ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నది. విధి నిర్వహణలో లేదా ఇతరత్రా ఏదైనా ప్రమాదం జరిగి సదరు ఉద్యోగి మరణిస్తే, వారి కుటుంబానికి ఈ బీమా సొమ్ము భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించనుంది.
ప్రతి నెలా రూ.24 కోట్ల వేతనాలు
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి నెలా సుమారు రూ.24 కోట్ల మేర వేతనాల చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో దాదాపు 70 శాతం మంది ఉద్యోగుల వేతన ఖాతాలు ఇప్పటికే ఎస్బీఐలోనే ఉండడంతో, వారికి ఈ బీమా సౌకర్యం తక్షణమే వర్తించనున్నది. మిగిలిన ఉద్యోగులు తమ ఖాతాలను అనుసంధానించుకోవడం ద్వారా ఈ భారీ బీమా రక్షణను పొందే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
