అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇవాళ(ఫిబ్రవరి 03,2020) జేఏసీ నేతలు, రైతులు పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు.
అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇవాళ(ఫిబ్రవరి 03,2020) జేఏసీ నేతలు, రైతులు పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. అపాయింట్ మెంట్ దొరికితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, హార్దీప్ సింగ్ పూరి సహా పలువురు మంత్రుల అపాయింట్ మెంట్ కోరారు. వీరందరినీ ఇవాళ పార్లమెంట్ ఆవరణలోనే కలువనున్నారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్రమంత్రులను వారంతా కోరనున్నారు.
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళనలు 49వ రోజుకి చేరాయి. తుళ్లూరు, మందడం, పెదపరిమి, తాడికొండలో ధర్నాలు చేపట్టారు. వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ తుళ్లూరు ధర్నాలో బీజేపీ నేతలు పాల్గొననున్నారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, వివిధ జేఏసీలు చేపట్టిన ఉద్యమం ఉద్ధృతమవుతోంది. రైతుల నిరసనలు, ఆందోళనలు 49 రోజుకు(ఫిబ్రవరి 03,2020) చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, నవులూరు, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున మహాధర్నాలు, దీక్షలు నిర్వహిస్తున్నారు.
రాజధాని వికేంద్రీకరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారన్న అక్కసుతో మండలిని రద్దు చేయడంపై రాజధాని ప్రాంత రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 రోజులకు పైగా తాము పలు రూపాల్లో నిరసన, ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ స్పందించక పోవడం శోచనీయమన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కోరిన వెంటనే తాము భూములు ఇస్తే ఈ రోజు ఇలా రోడ్ల పాలు చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. జై ఆంధ్రప్రదేశ్, సేవ్ అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
* రాజధాని ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న అమరావతి పరిరక్షణ సమితి నేతలు
* ఇవాళ కేంద్రమంత్రులను కలవనున్న జేఏసీ నేతలు, రైతులు
* అపాయింట్ మెంట్ దొరికితే మోడీని కలిసే అవకాశం
* అమిత్ షా, రాజ్ నాథ్, గడ్కరీ, నిర్మలా అపాయింట్ మెంట్ కోరిన రైతులు