ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి నియోజక వర్గంలోనూ క్వారంటైన్ పడకలను ఏర్పాట చేసింది.
రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గంలో 100 నుంచి 150 పడకలు క్వారంటైన్ కోసం ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్రం మొత్తమ్మీద బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఉన్నవి కాకుండా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ పడకలు 20 వేల వరకూ అందుబాటులోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు.
దీనిపై జిల్లా కలెక్టర్లు వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఆస్పత్రులు, స్కూళ్లు, కళాశాలలు, ఆర్టీసీ భవనాలు, డిగ్రీ కళాశాలలు ఇలా ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఆ భవనాలన్నిటినీ కరోనా వైరస్ లక్షణాలున్న వారికి చికిత్స చేసేందుకు సిద్ధం చేశారు.
ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా కరోనా చికిత్స చేయటానికి సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశ్రీ సీఈవో డా.ఎ.మల్లికార్జున చెప్పారు. పరిస్థితిని బట్టి క్వారంటైన్ కేంద్రాలు పెంచుకుంటూ వెళుతున్నామని.. అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రులను తీసుకుని క్వారంటైన్ లేదా చికిత్సా కేంద్రాలుగా మారుస్తామని ఆయన తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు, సిబ్బంది కూడా ఇందుకోసం సిద్ధంగా ఉండాలని సూచించారు.
కరోనా వైరస్ ని ఎదుర్కోటాని ప్రభుత్వం సిధ్ధంగా ఉందని..ఇప్పటికే పీజీ వైద్య విద్యార్థులెవరికీ సెలవులు ఇవ్వలేదు. వాళ్లందరూ పనిచేస్తున్నారని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డా.కె.వెంకటేష్ చెప్పారు. అవసరమైతే ఎంబీబీఎస్ విద్యార్థుల సేవలను కుడా తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా కరోనా నియంత్రణకు ముందుకు రావాలని ఇప్పటికే వారికి సమచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా మనకు 195 సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయని… ఎక్కడైతే సదుపాయాలు బాగున్నాయో అక్కడ క్వారంటైన్ ఏర్పాటుకు ఆదేశించినట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా.రామకృష్ణారావు చెప్పారు. వెంటిలేటర్లు ఉన్న ప్రతి ఏరియా ఆస్పత్రిలోనూ చికిత్సకు ఏర్పాట్లు చేశామని… 13 జిల్లా ఆస్పత్రుల్లోనూ కరోనా బాధితుల వైద్యానికి ప్రత్యేక పడకలు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆయన వివరించారు.
ఎలా పని చేస్తాయి
> నియోజకవర్గంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు క్వారంటైన్ కేంద్రంలోనే విధులు నిర్వహిస్తారు. ఒక్కో క్వారంటైన్ కేంద్రానికి ఒక మెడికల్ ఆఫీసర్ను ఇన్చార్జిగా నియమిస్తారు.
> ఒక్కో కేంద్రంలో 100 పడకలకు తగ్గకుండా ఏర్పాటు పూర్తయ్యాయి. ఇందులో 10 పడకలు వెంటిలేటర్తో కూడినవి.
> ఇవి కాకుండా మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్తో కూడిన పడకల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
> కరోనా అనుమానిత లక్షణాలుంటే వారిని వెంటనే ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్న క్వారంటైన్కు తరలించాలని జిల్లా వైద్యాధికారులకు, కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
> తాజాగా 4 బోధనాస్పత్రులను కేవలం కరోనా ఆస్పత్రులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
> 13 జిల్లా ఆస్పత్రులు, మరో 7 బోధనాస్పత్రుల్లోనూ కరోనా వైరస్ లక్షణాలున్న వారికి వైద్యమందిస్తారు.
> ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మరికొన్ని క్వారంటైన్ కేంద్రాలు పెంచేలా సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
> హై రిస్కు ప్రాంతాలు అంటే విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాల్లో మరికొన్ని ప్రత్యేక కేంద్రాలు పెంచాలని యోచిస్తున్నారు.