విజయవాడ : ఏపీ ఆర్టీసీ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త సేవల దిశగా అడుగులు వేస్తోంది. ఇంటింటికీ పార్శిల్స్ డెలివరీ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఏ ప్రాంతం నుంచైనా సరే అనుకున్న చోటికి పార్శిల్స్ ను డెలివరీ చేసేందుకు రెడీ అవుతోంది. దీని కోసం ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడలో ఇంటింటికీ పార్శిళ్లను చేరవేసే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఆర్టీసీ దీనిని మరింత విస్తరించాలనుకుంటోంది. భారీ ఎత్తున సరుకుల పార్శిల్స్ ను చేరవేసి ఆదాయాన్ని పెంచుకోవాలని..దీంతో నష్టాల నుండి బైటపడవచ్చని ఆశిస్తోంది. ఇందుకోసం డెలివరీ ఏజెన్సీలను ఏర్పాటు చేయాలని భావించి టెండర్లలను ఆహ్వానించింది. వీటిని ఖరారు చేసి త్వరలోనే విజయవాడలో పెద్ద ఎత్తున పార్శిళ్లను డోర్ డెలివరీ చేసేందుకు ప్లాన్స్ రెడీ చేసింది.
ఆర్టీసీ బస్సులు ప్రతి పల్లెకు వెళ్తుండడంతో ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని..ఏ ప్రాంతానికైనా ఒక్క రోజులనే డెలివరీ చేసే వీలుంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సేవలతో ఏపీ ఆర్టీసీ నష్టాల నుండి బైటపడుతుందేమో చూడాలి.