బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవటం చాలా మంచిదని..ఇది శుభసూచికం అని సీబీఐ మాజీ జేడీ..జనసేన నేత లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీతో కలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం మంచిదని..పవన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని తెలిపారు. రాజధాని మార్పుల నిర్ణయం ఏమిటనేది న్యాయస్ధానం తేలుస్తుందనీ..ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ సూచించారు.
అలాగే శాసన మండలి రద్దు చేయాలని ప్రతిపాదించిన ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అంతే తప్ప ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేయకూడదని అది రాజ్యాంగవిరుద్ధమని అన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగబద్దంగా పాలన చేయాలని ప్రజలు ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించకూడదని అన్నారు.
కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు న్యాయపరంగా ఉండాలని. ప్రభుత్వం ప్రొసీజర్సు ను ఫాలో కావాలని కోరుకుంటున్నానని లక్ష్మీనారాయణ సూచించారు. కాగా జనసేన పార్టీ ఆవిర్భావం అనంతరం 2019 ఎన్నికల్లో పోటీ చేసిన క్రమంలో జనసేన పార్టీ తరపును జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే.